ఎక్కడో ఇంకా..: రాజధానిపై బాబు, కేసీఆర్ ముందుకు
హైదరాబాద్: విభజన వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, రాజధాని ఎక్కడనే విషయం కూడా ఇంకా నిర్ణయం కాలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. పాత అసెంబ్లీ భవనంలోకి వెళుతుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన ఏడు మిషన్లపై వర్క్ షాప్లో చంద్రబాబు మాట్లాడారు.
విభజన జరిగిపోయిందని, ఈ విషయంలో చేయగలిగిందేమీలేదని, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేద్దామన్నారు. జాగ్రత్తగా పని చేయకపోతే కష్టాలు తప్పవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. ఏపీని డిజిటల్ రాష్ట్రంగా మారుద్దామన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చామన్నారు. భవిష్యత్లో అభివృద్ధిలో ముందుకెళ్లడానికే యాక్షన్ప్లాన్ అని, అందులో భాగంగానే ఏడు మిషన్లపై వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పదేళ్లుగా అవినీతిపై రాజీలేని పోరాటం చేశామన్నారు. విభజన సమయంలోనూ అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరమన్నారు. పార్టీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరగాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి సమన్వయం చేయాలని, నాయకుల్లో నైపుణ్యం పెరగాలని ఆకాంక్షించారు. ప్రతి అంశం పైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. పదేళ్ల తర్వాత గ్రామస్థాయి నుంచి దేశస్థాయి వరకు కొత్త పాలన వచ్చిందని, ప్రతి ఒక్కరు అభివృద్ధిని సీరియస్గా తీసుకోవాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. విద్యుత్ ఉత్పత్తిలోనూ అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. గత పదేళ్లలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని, పదేళ్లుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు.
ప్రధానిపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించిందని, మంత్రులు, ఐఏఎస్, పారిశ్రామికవేత్తేలు జైలుకెళ్లారన్నారు. గత పదేళ్లు దగాపడ్డ దశాబ్దమని అభివర్ణించారు. విభజనతో అనేక సమస్యలొచ్చాయన్నారు. కాంగ్రెస్ తప్పు చేసినందుకే ఏపీలో ఒక్కసీటు గెలవలేదన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ఇరురాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారన్నారు.
కేడర్ విభజన ఇంకా పూర్తికాలేదని, 89 వర్సిటీలు, సంస్థలు ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయన్నారు. పరస్పర అంగీకారంతోనే విభజన జరగాలని బాబు ఆకాంక్షించారు. సమస్య ఏదైనా సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కోలుకునేందుకు కేంద్రం ఉదారంగా సాయం చేయాలన్నారు. విభజన చట్టంలో ప్రస్తావించిన సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఏపీ పరిస్థితి వైకుంఠాపాళిలా ఉందన్నారు. భవిష్యత్లో సర్వీసు రంగమే కీలకమన్నారు.