నగరివీధుల్లో బాబుపై రోజా ఆగ్రహం, జగన్పై మళ్లీ జేసీ
హైదరాబాద్/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు, ప్రముఖ నటి రోజా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. ఆమె నగరి మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
సొంత పార్టీ వారికి పెన్షన్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పెన్షన్ల పేరుతో చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపుతున్నారన్నారు. చేనేత కార్మికుల తరఫున తాను పోరాడుతానని చెప్పారు.
పార్టీని కాపాడుకునేందుకే: జేసీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాపాడుకునేందుకే ఆందోళనలకు పిలుపునిస్తున్నారని అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు. ఆరు నెలల్లో మూతపడే పార్టీ కోసం కాంగ్రెసు పార్టీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు.
అన్న క్యాంటీన్లు, పెన్షన్ల కంటే పంట రుణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ అన్నారు. రుణమాఫీ ఎలా చేస్తారో తెలియనప్పటికీ, చంద్రబాబు చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. విభజన తర్వాత ఏపీలో ఆర్థిక లోటు ఉందని, ఏపీలో కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 80 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులోకి వస్తుందన్నారు.