మిషన్ 7: ఏపీ స్పీడ్ డెవలప్పై చంద్రబాబు ప్లాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మిషన్-7 ఏర్పాటు కానుందట. ఈ ఏడు మిషన్లకు ఆయా శాఖల మంత్రులు వైస్ చైర్మన్లుగా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. అభివృద్ధి సాధనలో ఈ ఏడు మిషన్లు.. మౌలిక సౌకర్యాలు, పరిశ్రమలు, సేవారంగం, పట్టణాభివృద్ది, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక రంగం, సామాజిక అభివృద్ధి కీలక సాధనాలుగా ప్రభుత్వం గుర్తించిందట.
ఆంధ్రప్రదేశ్ను ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడేసి సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఓ మిషన్ మోడ్ తరహాలో వెళ్లేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారట.
దీనికి సంబంధించి ఏడు అభివృద్ధి మిషన్లను ఆయన ప్రతిపాదించారు. ఈ ఏడు మిషన్లను ప్రభావవంతంగా అమలు చేసే తీరుతెన్నులపై చంద్రబాబు నివాసంలో మంగళవారం లోతైన చర్చ చేశారు. ఏడు మిషన్లకు సంబంధించి తొలుత ప్రాధాన్యతల ఆధారంగా మూడు మిషన్లపై చర్చించారట.
సామాజిక, పట్టణాభివృద్ధి, నైపుణ్యాల పెంపు తదితర అంశాలలో ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? వాటి నుంచి మరింత ముందుకు ఎలా వెళ్లాలి? అనే దానిపై ఏడు మిషన్లను రూపొందించాలని నిర్ణయించారు. ఈ ఏడు మిషన్లకు చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. సంబందిత మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరించనున్నారు.
కాగా, రాష్ట్రంలో మానవాభివృద్ధి తీరుతెన్నులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. దేశాభివృద్ధికి తరగని సిరులైన మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి గడిచిన రెండు దశాబ్దాల్లో ఏమి జరిగిందన్నదానిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.