సూటిగా చెప్తున్నా, ఓడించడమే..: బాబు టార్గెట్ కెసిఆర్
నల్లగొండ: తెరాసను అడ్డుకునేందుకు తాను కుట్ర చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోపిస్తున్నాడనిస సూటిగా..నేరుగా.. చెబుతున్నా, ఇందులో కుట్ర ఏమీ లేదు, కెసిఆర్ను ఓడించడమే తన లక్ష్యమని, తన పోరాటం అందుకేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు.
కెసిఆర్ను లక్ష్యంగా చేసుకని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. తెరాసకు అధికారమిస్తే..'భాంచన్ నీ కాళ్లు మొక్కుతా దొర' అనే రోజులు వస్తాయని అన్నారు. కెసిఆర్ తెలంగాణను బీహార్ చేస్తారని వ్యాఖ్యానించారు. 'కేసీఆర్ అసమర్థుడు.. మాయల మరాఠీ. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. అలాంటి వ్యక్తిని అడ్డుకునేందుకే టిడిపి పోరాటం చేస్తోంది' అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాదని తేలిపోయిందని, టిడిపి - బిజెపి కూటమి వద్దకు ఉరికి వచ్చే మొదటి వ్యక్తి కెసిఆరేనని జోస్యం చెప్పారు. కెసిఆర్ను చూసి హైదరాబాద్లో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదని, పెట్టడానికి మున్ముందు కూడా ఎవ్వరూ రారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గమనించి తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చామన్నారు.
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవినీతి అనకొండలుగా మారారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, దామోదర్రెడ్డి అవినీతిలో కూరుకుపోయారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని వదిలి పెట్టనని, ఇక్కడి పేదలతో నా అనుబంధం బలమైనదని, వారి నుంచి నన్ను ఎవ్వడూ విడదీయలేడని, తెలంగాణను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు.
సూర్యాపేట సభలో జై తెలంగాణ అని నినదించారు. కేంద్రంలో 300 సీట్లతో ఎన్డీయే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తమది సెక్యులర్ పార్టీ అని, హైదరాబాద్లో కర్ఫ్యూలు లేకుండా చేసిన ఘనత తమ పార్టీదేనని ఆయన చెప్పుకున్నారు.