కెసిఆర్కు బాబు కౌంటర్: మెట్రోపై మొండిగా రేవంత్
హైదరాబాద్: తెలంగాణలోని తెలుగు తమ్ముళ్ల మధ్య రాజీ కుదర్చడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో చంద్రబాబు వారి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. దానికి తోడు, దసరా తర్వాత తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వారిని ఆపడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులతో మంగళవారం సమావేశమయ్యారు.
తెలంగాణ శాసనసభ్యులతో ఆయన విడివిడిగా కూడా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించి, తెరాసలోకి వెళ్లకుండా చూసే వ్యూహంలో భాగంగానే ఆ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకరరావుతోపాటు, రేవంత్రెడ్డి, ధర్మారెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
తెరాస నుంచి తమపై వస్తున్నఒత్తిళ్ల గురించి, తెరాస మైండ్ గేమ్ ఆడుతున్న తీరు గురించి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకరరావు టీ. సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని, కేవలం రామేశ్వరరావు ఏపీసోడ్లో మాత్రమే కేసీఆర్ను కలిసినట్లు ఎర్రబెల్లి వివరణ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది.
రామేశ్వరరావు తనకు మిత్రుడని, రామేశ్వర రావుకు ఏ సమస్య వచ్చిన ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నప్పుటికీ కలుస్తానని, గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ఇలా ఎవరు ఉన్నప్పటికీ రామేశ్వరరావుకు సమస్య వచ్చినప్పుడల్లా కలుస్తానని వివరణ ఇచ్చినట్లు తెలియవచ్చింది.ఆ క్రమంలోనే ఇప్పుడు కెసిఆర్ను కలిశానని, ఈ భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని ఎర్రబెట్లి చెప్పినట్లుగా సమాచారం.
ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు నలుగురు టిడిపి శాసనసభ్యులు తెరాసలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తాను టిడిపిలోనే ఉంటానని దయాకర్ రావు మంగళవారంనాడు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రామేశ్వర రావుపై ఆరోపణలు చేసినా తనకు అభ్యంతరం లేదని, దాన్ని ఉపయోగించుకుని ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యం చేసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. మెట్రో రైలు భూముల విషయంలో రామేశ్వర రావు తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, మెట్రో రైలుపై వెనక్కి తగ్గడానికి రేవంత్ రెడ్డి సుముఖంగా లేరు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు వద్ద స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మెట్రో రైలు విషయంలో తాను వెనక్కి తగ్గబోనని, మరిన్ని ఆధారాలతో ముందుకు వస్తానని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం.