గుండెల్లో నిద్రపోతా: సోనియాకు చంద్రబాబు హెచ్చరిక
తాడేపల్లిగూడెం: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్రంగా హెచ్చరించారు. సోనియా గాంధీ గుండెల్లో నిద్రపోతానని, రైళ్లు పరిగెత్తిస్తానని, మడమ తిప్పేది లేదని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రజాగర్జన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ నాయకులకు తాను భయపడేది లేదని ఆయన అన్నారు. తానంటే సోనియా గాంధీకి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందుకే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తనపై వైయస్ రాజశేఖర రెడ్డి కేసులు పెట్టారని, విచారణ జరిపించాలని, అయినా ఏమీ తేల్చలేకపోయారని, తాను నిప్పులా బతికానని ఆయన అన్నారు. మీ సంగతి చూస్తాను, ఖబడ్దార్ అంటూ ఆయన సోనియా గాంధీని హెచ్చరించారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) భూస్థాపితమవుతాయని ఆయన అన్నారు.
గాంధీని చంపిన గాడ్సేలా తెలుగుజాతిని చంపిన గాడ్సే సోనియా గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో గొడవకు సోనియానే కారణమని ఆయన అన్నారు. విద్వేషాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని అన్నారు. విభజన రాజకీయాలతో తెలుగుజాతి మధ్య విద్వేషాలు పెంచారని ఆయన విమర్సించారు. విభజన అంశం చాలా సున్నితమైందని, ఇరు ప్రాంతాలవారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని చెప్పానని, అయినా వినలేదని ఆయన అన్నారు.
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన విధానం అభ్యంతకరమని ఆయన అన్నారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియాకు మన కష్టాలేం తెలుసునని చంద్రబాబు అడిగారు. విభజనలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణలో తెరాసతో, సీమాంధ్రలో సైకో జగన్తో కుమ్మక్కయి కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు.
తెలుగుదేశం కారణంగానే మూడు సార్లు కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, ప్రజలు సహకరిస్తే తిరిగి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని సోనియా భ్రష్టు పట్టించారని అన్నారు. అధికారం కోసం తెలుగుజాతితో ఆడుకునే అధికారం ఎవరిచ్చారని అడిగారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తమ పార్టీదేనని ఆయన అన్నారు. ఖబడ్దార్ మీ సంగతి చూస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ను కెసిఆర్ అభివృద్ధి చేశాడా, కాంగ్రెసు దొంగలు చేశారా, జగన్ చేశాడా, వైయస్ చేశాడా, కిరణ్ చేశాడా అని అడుగుతూ తమ పార్టీ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని చెప్పుకున్నారు. తెలుగువారితో పెట్టుకున్నవారెవరూ బాగుపడలేదని అన్నారు. ఇతర పార్టీలను కూడగట్టి కాంగ్రెసును ఎదిరిస్తామని ఆయన అన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో హైటెక్ సిటీని, సైబరాబాద్ను అభివృద్ధి చేశానని ఆయన అన్నారు. అందరి కోసమని చెప్పి హైదరాబాద్ను అభివృద్ధి చేశానని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసిన ఘనత ఎన్టీ రామారావుది, తనదేనని ఆయన అన్నారు.
కెసిఆర్ స్వయంపాలన కావాలంటున్నారని, ఇక్కడే తాను పుట్టానని, తెలుగువాడిని తాను వస్తే కెసిఆర్కు తప్పుగా కనిపిస్తోందని, సోనియా మాత్రం రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. వీరు మనుషులేనా అని ఆయన అడిగారు. కాంగ్రెసు దొంగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో దోపిడీ ప్రారంభమైందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో అందరూ బాధపడుతున్నారని, కనీస నిబంధనలను కూడా పాటించడం లేదని ఆయన విమర్సించారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ మైనపు బొమ్మ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెసు నాటకాలాడుతోందని ఆయన అన్నారు. ప్రజల కష్టాలు చూసేందుకే తాను పాదయాత్ర చేశానని చెప్పారు. తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం చూసి తాను కూడా బుల్లెట్ ఎక్కానని ఆయన అన్నారు. ఎవరి వల్ల ప్రయోజనం చేకూరుతుందో ఆలోచించాలని, ఎన్నికల సమయంలో ఆలోచన చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.