కెసిఆర్కు బాబు లేఖ: అడ్మిషన్లు ప్రారంభించాలని వినతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు శుక్రవారం ఓ లేఖ రాశారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల అడిషన్లపై చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆ లేఖలో కెసిఆర్కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల అడ్మిషన్లపై స్తబ్దత నెలకొన్న నేపథ్యంలోనే సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గత రెండురోజులుగా చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే.
విద్యార్థులు నష్టపోకుండా అడ్మిషన్లు వెంటనే చేపట్టాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. అడ్మిషన్లు ఆలస్యమైతే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు.
అడ్మిషన్లు ఆలస్యమవడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతే విద్యాసంస్థలు నష్టపోతాయని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సహకరించాలని చంద్రబాబు కోరారు.