దర్జాగా స్పీకర్ సీట్లో: ఏపీ అసెంబ్లీలో హల్చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలోకి బుధవారం ఉదయం ఓ యువకుడు ప్రవేశించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో లోపలకు ప్రవేశించిన అతను తలుపులు ధ్వంసం చేసి, అరగంటకు పైగా సభలోనే ఉన్నా భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారు. ఎనిమిది గంటలకు అతనిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అతను వరంగల్ జిల్లాకు చెందిన అశోక్ రెడ్డిగా గుర్తించారు. మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు.
కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటనలో బాధ్యులుగా గుర్తించి నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అత్యంత భద్రతావాలయంలో ఉన్న శాసన సభలోకి వ్యక్తి ప్రవేశించడమే కాకుండా రెండుచోట్ల తలుపులను బద్దలు కొట్ట సమావేశ మందిరంలోకి వెళ్లినా గుర్తించలేదు. మరో రెండు వారాల్లో శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి, సభాపతి, మంత్రులు మాతర్మే శాసన సభలోకి ప్రవేశించే ఒకటో నెంబర్ గేట్ నుండి అతను ఉదయం లోపలకు వెళ్లాడు.
సుమారు ఇరవై అడుగుల ఎత్తున్న గేటును ఎక్కి లోపలకు దిగినా భద్రతా సిబ్బంది గుర్తించలేదు. ఆరో నెంబర్ గేట్ దగ్గరున్న తలుపులను పగలగొట్టి లోపలకు చొరబడ్డాడు. సభాపతి స్థానంలో కూర్చొని అక్కడంతా కలియతిరిగాడు. కుర్చీల్లో కూర్చున్నాడు. పది గంటలకు డీసీపీ కమలాసన్ రెడ్డి అతనిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. భద్రతా సిబ్బంది, అసెంబ్లీ అధికారుల వాంగ్మూలం రికార్డ్ చేశారు. నిందితుడి భార్య జ్యోతిని విచారిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భద్రతలో ఉన్న డొల్లతనం బయటపడింది. అగంతకుడు దర్జాగా మెయిన్ గేట్ ఎక్కి, ఎపి అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారాన్ని ధూమ్ధామ్గా పగులగొట్టి నేరుగా స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు. బుధవారం ఉదయం.. అదీ వాహనాలతో బిజీగా ఉండే లక్డీకాపూల్ వెళ్ళే ప్రధాన మార్గంలో, డిజిపి ఆఫీసు పక్కనే ఉన్న అసెంబ్లీ మెయిన్ గేటు ఎక్కి అసెంబ్లీలోకి చొరబడ్డాడంటే, భద్రత ఎంత పటిష్టంగా ఉందో స్పష్టమవుతున్నది.
ఏపీ అసెంబ్లీ
మంగళవారం రంజాన్ పండుగ కావడంతో అసెంబ్లీకి సెలవు. బుధవారం ఉదయం 7.20 గంటలకు ఓ ఆగంతకుడు అసెంబ్లీ మెయిన్ గేటు ఎక్కి, లోపలి వైపు దిగాడు. గేటు పక్కనే పోలీసులు ఉండే క్యాంప్ ఉంటుంది.
ఏపీ అసెంబ్లీ
ఆ క్యాంప్లో నలుగురు ఎస్పిఎఫ్ జవాన్లు కాపలా ఉన్నారు. అది మామూలు గేటు కాదు. 20 అడుగుల ఎత్తయన గేటు. అంతేకాదు ఆ ప్రధాన ద్వారం నుంచి గవర్నర్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమే వెళ్ళేందుకు అనుమతిస్తారు. ఎమ్మెల్యేలు కూడా 2వ నెంబర్ గేటు నుంచే లోపలికి వెళ్ళాలి.
ఏపీ అసెంబ్లీ
అంతటి ముఖ్యమైన, వివిఐపిలు వెళ్ళే మెయిన్ గేటుపైకి ఆగంతకుడు ఎక్కి, లోపలి వైపు దిగి దర్జాగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాడు. తొలుత ఉన్న ఒక ద్వారాన్ని తోయడంతో, అది తాళం తీయకుండానే గొళ్ళెంతో సహా పక్కకు జరిగి, ద్వారం తెరుచుకుంది.
ఏపీ అసెంబ్లీ
ఆ వెంటనే ఇన్నర్ లాబీలో ఉండే రెండో ద్వారం అద్దాన్ని పగుల గొట్టాడు. అంతేకాదు ఆ ద్వారాన్ని ఇష్టం వచ్చినట్లుగా పగుల గొట్టి ఎమ్మెల్యేలు కూర్చునే సమావేశ మందిరంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత స్పీకర్ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. మెయిన్ గేటు ఎక్కి, లోపలికి దిగినా, ద్వారాన్ని పగులగొడుతున్నా, అసెంబ్లీ భద్రతా సిబ్బందికి కనిపించకపోవడం, వినిపించకపోవడం గమనార్హం.
ఏపీ అసెంబ్లీ
సమావేశ మందిరంలో కలియ తిరిగిన తర్వాత బోర్ కొట్టిందేమో, ఆగంతకుడు బయటకు వెళ్ళి ఓ చెట్టు కింద సేద దీరాడు. ఇదంతా సుమారు అరగంటకు పైగా జరిగింది. అప్పటి వరకూ గేట్ నెంబర్-1 పోలీసులు మేల్కొనే లేదు.
ఏపీ అసెంబ్లీ
సదరు ఆగంతకుడు చెట్టు కింద కూర్చోవడంతో, అప్పుడు గేట్ నెంబర్-1 వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్పిఎఫ్ కానిస్టేబుల్ గట్టిగా ప్రశ్నించడంతో, గేటు ఎక్కి లోపలికి వచ్చానని చల్లగా చెప్పాడు.
ఏపీ అసెంబ్లీ
దీంతో ఆ కానిస్టేబుల్ ఆగంతకుడిని బంధించి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు ఎఎస్పి డికెఎస్ రాజుకు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ టి. కరుణాకర్కు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అక్కడికి చేరుకున్న వారు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డికి తెలిపారు.
ఏపీ అసెంబ్లీ
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు డిసిపి కమలాసన్ రెడ్డి ఆగంతకుడిని విచారించారు. వరంగల్ జిల్లా, పసరకు చెందిన అశోక్ రెడ్డిగా గుర్తించారు. గతంలో బంజారాహిల్స్లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పని చేసినప్పుడు కూడా ఇలాగే చేయడం ద్వారా ఉద్యోగం నుంచి తీసేసారని అశోక్ చెప్పాడట.
ఏపీ అసెంబ్లీ
ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉంటున్న అశోక్ తెల్లవారుజామున తన సతీమణిని చితకబాది, ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకుని గేటు ఎక్కి లోపలికి దిగినట్లు చెప్పాడని డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. అశోక్ మానసిక స్థితి బాగా లేదని, తాను ఏమి చేస్తున్నాడో కూడా తెలియడం లేదని ఆయన చెప్పారు. మూడు గంటల పాటు విచారణ జరిపిన డిసిపి ఆ తర్వాత అశోక్ను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
ఏపీ అసెంబ్లీ
ఇలాఉండగా డిసిపి కమలాసన్ రెడ్డి అసెంబ్లీ సిసి ఫుటేజీని చూసి నివ్వెరపోయారు. అశోక్ దర్జాగా గేటు ఎక్కి వస్తున్నా, పక్కన గదిలో ఉన్న పోలీసులు గమనించలేదు. అయినా ఆ పోలీసులు గదిలో కాకుండా గేటు పక్కనే ఆయుధంతో విధి నిర్వహణలో ఉండాలి. అటువంటిది అశోక్ లోపలికి వెళ్ళడాన్ని పసిగట్టలేదు. దీంతో ఆ నలుగురినీ విచారించారు. ఆ నలుగురిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఆ నలుగురినీ సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ
అశోక్ పట్టుబడకుండా పారిపోయి ఉంటే, అసెంబ్లీకి ఉద్యోగులు వచ్చిన తర్వాత జరిగిన దానిని చూస్తే రెండు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య గొడవ జరిగి ఉండేదని పోలీసు అధికారులు, అసెంబ్లీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీని కావాలనే ధ్వంసం చేశారన్న అపవాదు తెలంగాణ ఉద్యోగులపై వచ్చేదని, దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఉండేది. అశోక్ సతీమణిని పోలీసు అధికారులు పిలిపించి మాట్లాడగా, తన భర్త ఆరోగ్యం బాగా లేదని, మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందాడని తెలిపారు. అశోక్ చేతికి సెలైన్ ఎక్కించినట్లుగా గుర్తు కూడా ఉంది.