చిరు రూ. 50 లక్షలు: మెగా ఫ్యాన్స్కు పిలుపు
హైదరాబాద్: తుఫాను తాకిడికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఎంపి ల్యాడ్స్ కింద 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన బుధవారం మెగా ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తుఫాను సహాయక చర్యలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన వేయి కోట్ల రూపాయలు సరిపోవని, 2 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో తుఫాను తాకిడి ప్రాంతాల్లో తాను పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ తేదీల్లోనే కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తుఫాను తాకిడి ప్రాంతాల పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.
విహెచ్ విరాళం
హుధుద్ తుఫాను బాధితుల సహాయం కోసం కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తన నెల రోజుల జీతాన్ని సిఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కలిసి చెక్కును అందించారు. తనకు విశాఖపట్నంతో ప్రత్యేక అనుబంధం ఉందని విహెచ్ ఈ సందర్భంగా అన్నారు. ఈ నెల 18వ తేదీన తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.
నిత్యావసర సరుకుల ధరల అదుపు
తుపాను బీభత్సంతో పెరిగిపోయిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖలోని ఎంవీపీ రైతు బజార్, సీతమ్మధార రైతు బజార్లలో కిలో కూరగాయలు రూ.3 నుంచి రూ.5 లకు విక్రయిస్తున్నారని మంత్రి పరిటా సునీత తెలిపారు. పాల ప్యాకెట్లు ఎక్కువ ధరకు అమ్మిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.