వారిని కాదని బాలకృష్ణకు ఎలా ఇస్తారు: చిరంజీవి ప్రశ్న
రాజమండ్రి/మెదక్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తన సహ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ను ముస్లింలకు కాదని బాలకృష్ణకు ఇచ్చారని చిరంజీవి టిడిపిపై విమర్శలు గుప్పించారు.
తాను కాంగ్రెసు పార్టీలో సామాజిక న్యాయం చూశానని చెప్పారు. టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెసు పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆ న్యాయం దక్కలేదన్నారు. హిందూపురంను ముస్లింలకు కాకుండా బాలయ్యకు ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు నిజంగానే అంత బలం ఉంటే స్వతంత్రంగా పోటీ చేయకుండా.. భారతీయ జనతా పార్టీతో కలిసి ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. పవన్, తన దారి వేరైనా గమ్యం ఒక్కటేనని చిరంజీవి చెప్పారు.
రెండుచోట్ల ఎందుకు: జైరాం
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ చెప్పుకుంటున్న కెసిఆర్... రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఆయన రెండు చోట్ల పోటీచేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లా రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జైరాం మాట్లాడారు.