పవన్ టు వెంకయ్య... ఇండికేషన్సేనా: చిరంజీవి బీజేపీలో చేరుతారా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారా? అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది మదిలో మెదలుతోంది. ఆయా రాష్ట్రాల్లో బలోపేతం అయ్యేందుకు బీజేపీ సినిమా తారల వైపు చూస్తున్న విషయం అర్థమవుతోనే ఉంది.
తమిళనాడులో రజనీకాంత్, విజయ్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. పశ్చిమ బెంగాల్లో రూపా గంగూలీలను ఇటీవల పార్టీలో చేర్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు, ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందులో భాగంగా చిరంజీవిని దువ్వుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అవి ఎంత వరకు వాస్తవమో తెలియనప్పటికీ.. పరిస్థితులను చూస్తే చిరంజీవి బీజేపీలో చేరడమే ఉత్తమమనే వారు కూడా ఉన్నారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టాప్ లీడర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు ఏమాత్రం లేవని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఆ తర్వాత వరుసగా రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. 2019 నాటికి తెలంగాణ, ఏపీల్లో అధికార లేదా ప్రతిపక్ష హోదాకు చేరుకోవాలని చూస్తోంది.
ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జరిపిన సంక్రాంతి వేడుకలకు చిరు సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆ సమయంలో వెంకయ్య.. చిరు పైన ప్రశంసల వర్షం కురిపించారు. వీటన్నింటిని చూస్తుంటే చిరు బీజేపీలో చేరుతారా అనే ప్రశ్న ఉదయిస్తోందని అంటున్నారు. అంతకుముందు ఓ కార్యక్రమంలో పవన్ చాలా రోజుల తర్వాత చిరును ప్రశంసలతో ముంచెంత్తారు. బీజేపీ చిరు వద్దకు కొందరిని పంపించిందని కూడా వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీకి పాపులరిటీ ఉన్న నేతలు కావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కావాలి. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి సమస్య లేదు. ఏపీలో టీడీపీతో పొత్తు నేపథ్యంలో పాపులర్ ఫిగర్ కావాలని అంటున్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతివ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో, విభజన సమయంలో ఏపీకి అండగా నిలవడం వల్ల ఏపీలో బీజేపీ పట్ల సానుభూతి ఉందని అంటున్నారు.