ఎవరేం మాట్లాడుతున్నారో, సోనియా సభ పెడ్తే: పొన్నాల
హైదరాబాద్: ఎవరేం మాట్లాడుతున్నారో అన్ని హైకమాండ్ అంతా గమనిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం అన్నారు. ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తన పదవి పోతుందన్న వ్యాఖ్యలను అలా మాట్లాడిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. పార్టీ నేతల మధ్య సమన్వయం పెరగాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి ధీటుగా తాము ప్రచారం చేయలేకపోయామని ఆయన అన్నారు. మేనిఫెస్టో ఆలస్యం చేయడం ఇబ్బందిగా మారిందన్నారు. తెలంగాణ ఇవ్వగానే సోనియా సభ పెట్టి ఉంటే మంచి ఊపు వచ్చి ఉండేదన్నారు. తెరాస ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెసు కృషి అంటూ సికింద్రాబాదులో సభ నిర్వహించి ఉంటే కాంగ్రెసు పార్టీ ఇమేజ్ బాగా పెరిగి ఉండేదని మరో నేత షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు మేనిఫెస్టో ఆలస్యం కావడంతో ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం వాటిల్లిందన్నారు. తెరాస మాదిరిగా రుణమాఫీ పథకాన్ని కాంగ్రెసు మేనిఫెస్టోలో పెట్టకపోవడం కూడా దెబ్బతీసిందన్నారు.
కొందరు నేతలు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం ఇంకా కాంగ్రెసు పార్టీ పట్ల అంకితభావంతో ఉన్నారని చెప్పారు. 2004లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన రోజునే విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశామన్నారు. తెరాస అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా ఇంకా హామీలు నెరవేర్చలేదన్నారు.
ఐదేళ్లలో మిగులు విద్యుత్: కేటీఆర్
ఐదేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వేరుగా అన్నారు. ప్రజాప్రతినిధులకు హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉండాలని సూచించారు.