అద్దెకు జగ్గారెడ్డి: నాయిని, కేటీఆర్ అంతలేడని రేవంత్పై
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జగ్గారెడ్డి పచ్చి ద్రోహి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం విమర్శించారు. బీజేపీకి పోటీ చేసే అభ్యర్థి దొరక్క చివరకు కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డిని అద్దెకు తెచ్చుకున్నారన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్లో పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్ బ్రోకర్లు పెద్ద ఎత్తున దండుకున్నారని సీఐడీ విచారణలో అక్రమార్కులని తేలిన వారిని ఎవరినీ వదిలేది లేదని అందరినీ లోపలికితోస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఓ బచ్చా అన్నారు. కేసీఆర్ కొడుకంత కూడా లేడు కేసీఆర్పై నోరు పారేసుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సునీతా లక్ష్మారెడ్డిని బలికా బక్రా చేశారన్నారు.
మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రజలు తెరాసను గుండెలకు హత్తుకుని గెలిపిస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సచివాలయంలోని మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇమేజ్ దెబ్బతీసేలా, ఇక్కడికి పరిశ్రమలు రాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించేలా విమర్శలు చేస్తున్నవారిని బహిష్కరించాల్సిన అవసరముందన్నారు.
ఓయూ తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాల్రాజ్యాదవ్ మాట్లాడుతూ తాము మెదక్లో టీఆర్ఎస్కు మద్దతునిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం తెలంగాణ సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి అమరుల త్యాగాలను బీజేపీ, టీడీపీలు కించపరిచాయన్నారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి లేదన్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలకు ఆయన సూచించారు.