క్షమించమన్న జగ్గారెడ్డి, వామపక్షాల మద్దతడిగిన హరీష్
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అని గట్టిగా చెబుతున్న టీఆర్ఎస్ అందుకోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్సిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో వామపక్షాలైన సీపీఐ, సీపీఎం, కార్యదర్శులు చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రంతో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, భారీ పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని హరీష్ రావు వారిని కోరారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు.
ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గజ్వేల్ శాసనసభ, మెదక్ పార్లమెంట్ స్దానాల నుండి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో మెదక్ పార్లమెంట్ స్దానం ఖాళీ అయింది. దీంతో టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్దిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలను అభ్యర్దిగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మేల్యే జగ్గారెడ్డిని తమ పార్టీ అభ్యర్దిగా దింపింది. బీజేపీకి టిడీపీ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
సారీ చెప్పిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల బీజెపీలోకి చేరిన మాజీ ఎమ్మేల్యే, బీజెపీ ఎంపీ అభ్యర్ది తూర్పు జయప్రకాష్ రెడ్డి తనని క్షమించాల్సిందిగా కోరాడు. పార్టీ మారే విషయంలో మీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తక్కువ సమయం ఉండటంతో చెప్పలేకపోయానని, అందుకు పెద్ద మనసుతో క్షమిచండి. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజెపీ నాయకులు ఆహ్వానించి మెదక్ లోకసభ స్దానంలో పోటీచేయాల్సిందిగా కోరారు.
దీంతో ఆ పార్టీలో చేరానన్నారు. గురువారం సీఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన టీజేఆర్ యువసేన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేవలం అభివృద్దిని దృష్టిలో పెట్టుకోని పార్టీ మారానని అన్నాడు.
ఇందుకు కార్యకర్తలు, శ్రేయాభిలాషులు అందరు సహకరించాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఏరోజు కూడా కార్యకర్తలు మరువలేదన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తన కార్యకర్తలతో పాటు బీజెపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి గెలుపునకు తోడ్పాలన్నారు.
మెదక్ను అభివృద్ది చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహాకారం ఎంతో అవసరం. టికెట్ కోసమే పార్టీ మారానంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికోట్టాలన్నారు.