నా వద్దకెందుకొచ్చారు: టిపై వెంకయ్య, 300: జవదేకర్
హైదరాబాద్/చిత్తూరు: మోడీ గాలి చూసి కాంగ్రెసు పార్టీ భయపడుతోందని, ఆయన శక్తిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. కాంగ్రెస్ శకం ముగిసిందన్నారు. బిజెపి బలం రోజురోజుకీ పెరుగుతోందని, ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు చరమగీతం పాడనున్నారని చెప్పారు. కాంగ్రెస్ హుందాగా ఓటమిని అంగీకరించి గౌరవనీయ ప్రతిపక్ష పాత్రను పోషించాలని సూచించారు.
తాము మద్దతివ్వకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదే కాదన్నారు. జైరాం రమేశ్ ఎందుకు తన వద్దకు ఎనిమిది సార్లు వచ్చారని, ఎందుకు మీ ఆర్థిక మంత్రి తమతో మాట్లాడారని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో తమతో చేతులు ఎందుకు కలిపారన్నారు. మీ పార్టీ వాళ్లు తెలంగాణను వ్యతిరేకిస్తే, మీకు సంఖ్యా బలం లేకుంటే, మేము మద్దతిస్తే తెలంగాణ బిల్లు పాసయిందని, ఇదే విషయాన్ని కాంగ్రెసు నేతలే చెబుతున్నారన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 300 లోకసభ స్థానాలు ఖాయమని బిజెపి అధికార ప్రతినిధి నేత ప్రకాష్ జవదేకర్ చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. దక్షిణ భారత దేశం నుంచి 55 స్థానాలు సొంతం చేసుకుంటామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది భారీ పోలింగ్ను బట్టి అర్ధమవుతుందన్నారు. ఆయన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలో మీడియా మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే 272 ఎంపీ సీట్లు సాధించడమే కాదు, 300 సీట్లు దాటుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనూ గెలుపు సాధిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలను బిజెపి-టిడిపి కూటమి గెలుచుకుంటుందన్నారు.