చిరుపై సొంత నేత సంచలనం, బాలకృష్ణపై జగన్పార్టీ నేత
హైదరాబాద్/విజయవాడ/అనంతపురం: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర ప్రాంత ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి పైన ఆ పార్టీ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం కృష్ణా జిల్లా తిరువూరులో కాంగ్రెస్ రెబల్గా నామినేషన్ దాఖలు చేసిన నంబూరు శ్రీను అనే నేత చిరుపై విరుచుకు పడ్డారు.
కాంగ్రెస్లో టికెట్ ఇప్పిస్తామని ఐదేళ్ల క్రితం హైదరాబాద్లో కొంత భూమిని పార్టీ ఆఫీసు కోసం రిజస్టర్ చేయించుకున్నారంటూ ఆరోపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అంటూ మీడియాకు చూపించారట.
కాగా, గతంలో నంబూరు శ్రీనుకు ప్రజారాజ్యం పార్టీ తరపున తిరువూరు నుంచి టికెట్ కేటాయించి చివరి నిమిషంలో మరొకరి కేటాయించారు. ఈ క్రమంలో పిఆర్పీలో టిక్కెటు ఇస్తామంటూ పార్టీ ఆఫీసు కోసం తన భూమిని రిజిస్టర్ చేయించుకున్నారని, అయితే తనకు టికెట్ ఇవ్వనందున తన భూమిని ఇవ్వాల్సిందిగా చిరంజీవిని కోరగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు టికెట్ ఇప్పిస్తామని చిరంజీవి, కెవిపి హామీ ఇచ్చారని చెప్పారంటున్నారు.
కాగా ఈసారి కూడా తిరువూరు టికెట్ వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో నంబూరు శ్రీను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అలాగే భూమి విషయంలో చిరంజీవిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామనని శ్రీను హెచ్చరించారట.
బాలకృష్ణపై జగన్ పార్టీ నేత
వైయస్ కుటుంబంపై ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హిందూపురం లోకసభ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గురువారం అన్నారు. హిందూపురం బరిలో బాలకృష్ణ దిగినప్పటికీ ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు. వైయస్ మరణం తర్వాత రాష్ట్రాభివృద్ధి మరింత కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టిడిపిలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.