కోర్టు అనుమతి: విహారయాత్రకు వైయస్ జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విహారయాత్రకు వెళ్లనున్నారు. దసరా సెలవుల సందర్భంగా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు రాజస్థాన్, లేదంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్లడానికి సిబిఐ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.
అక్రమాస్తుల కేసులో నిందితుడైన వైయస్ జగన్కు పిల్లలతో పాటు విహారయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది. పిల్లలతో కలిసి విహారయాత్ర వెళ్లడానికి వీలుగా తనకు అనుమతి మంజూరు చేయాలని జగన్ కోర్టును అభ్యర్థించారు. అభ్యర్థనకు బుధవారం కోర్టు అంగీకరించింది. పర్యటనకు వెళ్లే ముందు వివరాలను అందజేయాలని కోర్టు జగన్కు సూచించింది.
కాగా, బెంగళూర్ వెళ్లడానికి సిపిఐ కోర్టు ఇటీవల జగన్కు అనుమతి నిరాకరించింది. జగన్ తరుచూ బెంగళూర్ వెళ్తే విచారణ ముందుకు సాగదని, అందువల్ల జగన్కు బెంగళూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని సిబిఐ కోర్టు ముందు వాదించింది. సిబిఐ వాదనతో కోర్టు అంగీకరిస్తూ జగన్కు అనుమతి నిరాకరించింది.
జగన్కు గతంలో కోర్టు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. పార్లమెంటు సభ్యుడు కావడంతో పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లేందుకు, రాజకీయ పార్టీ అధ్యక్షుడు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించేందుకు కోర్టు జగన్కు అనుమతి ఇచ్చింది.