కెసిఆర్, రాములమ్మ ఆస్తులపై సిబిఐ విచారణకి ఆదేశం
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు షాక్ తగిలింది. కెసిఆర్ ఆస్తుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సిబిఐ ప్రత్యేక కోర్టు సిబిఐని శుక్రవారం ఆదేశించింది. కెసిఆర్, తెరాస సీనియర్ నేత హరీష్ రావు, కాంగ్రెసు పార్టీ నాయకురాలు విజయశాంతిల ఆస్తుల పైన విచారణ జరపాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో గురువారం ప్రయివేటు ఫిర్యాదు దాఖలైంది.
హైదరాబాదుకు చెందిన న్యాయవాది బాలాజీ వదేరా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాలాజీ పిటిషన్ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం స్వీకరించింది. అనంతరం కెసిఆర్, హరీష్ రావు, విజయశాంతిల ఆస్తుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
2001కి ముందు తక్కువగా ఉన్న కెసిఆర్, విజయశాంతి, హరీష్ రావుల ఆస్తులు ఆ తర్వాత భారీగా పెరిగాయని బాలాజీ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో వారు గడించారనే ఆరోపణలు విపక్షాల నుండి వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. వారి ముగ్గురు ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.
సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణపై సిబిఐ న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. కాగా, కెసిఆర్, హరీష్ రావు, తన ఆస్తుల పైన విచారణను తాను స్వాగతిస్తున్నానని విజయశాంతి చెప్పారు. ముగ్గురి ఆస్తులపై త్వరగా సిబిఐ విచారణ చేపట్టాలని ఆమె కోరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను ఎవరికి భయపడనని అన్నారు.
మరోవైపు తాను మీడియాలో వచ్చిన వార్తల మేరకు కోర్టుకు వెళ్లానని, రఘునందన్ రావు వంటి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారని, తెలంగాణ భవన్లో వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారన్న వార్తలను న్యాయవాది బాలాజీ వదేరా చెబుతున్నారు.