తీరం దాటిన ఫైలిన్:ఒడిషాలో ఆరుగురు మృతి
న్యూఢిల్లీ: ఫైలిన్ తుఫాన్ శనివారం సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు గోపాల్పూర్ వద్ద తీరాన్ని దాటింది. సముద్రపుటలలు మృత్యు కెరటాలను విసురుతోంది. తుఫాన్ ధాటికి ఒడిషాలో ఆరుగురు మరణించారు. తీర ప్రాంతంలో ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. 23 ఏళ్ల తర్వాత అతి పెద్ద రెస్క్యూ ఆపరేషన్ను ప్రభుత్వాలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నంలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. ఇక ఫైలిన్ తీవ్ర వాయుగుండగా సాగనుంది. దీని ప్రభావంతో ఒడిషాలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తుఫాను ప్రభావంతో ఆరు గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటినట్లు అమెరికా వాతావరణ పరిశోధన కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో సముద్రం 50 అడుగుల ముందుకు వచ్చింది. దాదాపు 25 సెంటిమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్తు లేకపోవడంతో అంధకారం అలుముకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను తాకిడి ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కేంద్ర హోం శాఖ మంత్రి చెప్పారు. సహాయక శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒడిషా, ఆంధ్రప్రదేశ్లపైనే తుఫాను ప్రభావం ఉందని చెప్పారు. 12 విమానాలు, 18 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తీరప్రాంతానికి 40-60 కిలోమీటర్ల దూరం వరకు తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పారు. వరద ప్రాంతాల్లో మంచినీరు, మందులు, ఆహారపదార్థాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఫైలిన్ తుఫాన్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గోపాల్పూర్కు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాను 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నట్లు అంతకు ముందు అధికారులు చెప్పారు. తుఫాను ప్రమాదం దృష్ట్యా ఒడిషాలో 4.25 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు హోంశాఖ కార్యదర్శి చెప్పారు. తుఫాను రాత్రి 8 గంటల ప్రాంతంలో కళింగపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
తీరం దాటిన తర్వాత ఆరు గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుంది. రేపు ఉదయం తుఫాను వేగం మందగించి వాయవ్యం వైపు కదులుతుందని న్యూఢిల్లీలోని సంబంధిత అధికారి చెప్పారు. తుఫాను ప్రభావంతో చత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇంత భారీ యెత్తున ప్రజలను తరలించడం 1990 తర్వాత ఇది రెండోసారి అని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. ఫైలిన్ కొద్ది గంటల్లో తీరాన్ని తాకనున్న నేపథ్యంలో క్యాబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పరిస్థితిని సమీక్షించారు. వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.
సహాయక చర్యల కోసం అర్మీ, ఐఎఎఫ్, నేవీ, ఎన్డిఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. తుఫాను తీరం దాటే సమయంలో 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 3.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. సముద్రం 300 నునుంచి 600 మీటర్ల మేరు భూమి మీదికి చొచ్చుకుని వస్తుందని అంచనా వేస్తున్నారు.
తుఫాను కారణంగా ఒడిషాలోని పూరి, గోపాల్పూర్ల్లో తీవ్రమైన విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గోపాల్పూర్ నుంచి లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిషాలోని గంజాం, పూరి, ఖుర్దా, జగత్సింగ్పూర్ జిల్లాలో తుఫాను తాకిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు తుఫాను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 52 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విజయనగరం జిల్లాలో 15 వేల నుంచి 15 వేల మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని విశాఖపట్నంలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి చెప్పారు.