కెవిపి రగడ: కెసిఆర్కి దామోదర సవాల్, దానంపై షర్మిల
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆదివారం మండిపడ్డారు. పార్టీని మూసేయాలని వైయస్ హయాంలో కెవిపి బేరం పెట్టారని, తాను చంపి పాతరేస్తానని హెచ్చరించడంతో తగ్గిపోయాడని కెసిఆర్ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెసు నేతలు నిప్పులు చెరిగారు. ప్రశ్నల వర్షం కురిపించారు.
కెసిఆర్కు మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు దామోదర రాజనర్సింహ సవాలు విసిరారు. ఉద్యమానికి ముందు.. ఇప్పుడు తన ఆస్తులు ప్రకటిస్తానని, కెసిఆర్కు ఆస్తులు ప్రకటించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. కల్లబొల్లి మాటలు చెప్పే కెసిఆర్ను ప్రజలు నమ్మవద్దన్నారు.
ఆనాడే చెప్పలేదేం: విహెచ్
కెవిపి రామచంద్ర రావు విషయం ఆనాడే ఎందుకు చెప్పలేదని రాజ్యసభ సభ్యులు, అంబరుపేట కాంగ్రెసు పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వి హనుమంత రావు అన్నారు. కెసిఆర్కు విశ్వసనీయత లేదని మండిపడ్డారు. టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా.. ఆనాడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
దానంపై షర్మిల ఫైర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల ఆదివారం విజయా రెడ్డి తరఫున ఖైరతాబాదులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మంత్రి దానం నాగేందర్ పైన నిప్పులు చెరిగారు. దానం ఓ కబ్జాకోరు అని ఆరోపించారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. వైయస్ ఆశీస్సులతోనే దానం గెలిచారన్నారు.