నేను రెడీ: మెదక్ బరిలో దామోదర! హరీష్కు బాధ్యత
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆసక్తితో ఉన్నారు. మంగళవారం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ ఎదుట ఆయన దీనిని వ్యక్తపరిచారు. ఇప్పటికే ఈ స్థానం నుండి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని పోటీ చేయించాలని పార్టీలోని కొందరు నేతలు భావిస్తున్నారు. తాజాగా తాను బరిలో నిలిచేందుకు సిద్ధమని దామోదర సంకేతాలిచ్చారు.
అనధికారిక పర్యటన కోసం హైదరాబాదుకు వచ్చిన దిగ్విజయ్ మంగళవారం దామోదర ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల గురించి ఆయనతో చర్చించారని తెలుస్తోంది. పోటీకి తాను సిద్ధమేనని దామోదర చెప్పారట. అనంతరం దిగ్విజయ్ పార్టీ సీనియర్ నేతలు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల గురించి చర్చించారు. అనంతరం దిగ్విజయ్ రేణుక చౌదరి ఇంటికి కూడా వెళ్లారు.
కాగా, బీజేపీ ఈసారి ఉప ఎన్నికను మరింత సీరియస్గా తీసుకుంటోంది. బీజేపీ తరఫున విద్యాసాగర రావు, నాగం జనార్ధన్ రెడ్డి, బద్దం బాల్ రెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. కిషన్ రెడ్డిని బరిలోకి దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరేంద్రనాథ్ కూడా ఆశిస్తున్నారు.
హరీష్ రావుకు మెదక్ బాధ్యత
ఉప ఎన్నికల షెడ్యూలులో మెదక్ లోకసభస్థానం కూడా ఉంది. ఇప్పుడు అక్కడ తెరాస పోటీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే ఉండటం, అదే రోజు రాత్రి సింగపూర్ పర్యటనకు వెళ్తుండడంతో ఆయన సోమవారం నగర శివారు నార్సింగ్లోని ప్రముఖ వ్యాపారవేత్త బోయినపల్లి శ్రీనివాస రావు నివాసంలో మంత్రి హరీశ్రావు, పలువురు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
ఉప ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థి ఎంపిక, అందుబాటులో ఉన్న వనరులు, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ సహా వివిధ అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈనెల 20 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుండటం, సెప్టెంబర్ 13న పోలింగ్ ఉండటం వెరసి వ్యవధి తక్కువగా ఉండటంతో ఉప ఎన్నికల సన్నాహకాల్లో వేగం పెంచాలని నిర్ణయించారు.
ఈ మేరకు పార్టీ తరఫున మెదక్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల బాధ్యతలను మంత్రి టి. హరీశ్ రావుకు కేసీఆర్ అప్పగించినట్లు సమాచారం. తాను మంగళవారం సింగపూర్ వెళ్లి 24న లేదా 26న తిరిగి హైదరాబాద్కు రానున్న దరిమిలా ఈలోగా ఉప ఎన్నికల పనులన్నీ చక్కబెట్టాలని ఆయన హరీశ్ రావును ఆదేశించినట్లు తెలిసింది. మెదక్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలంతా ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని నిర్దేశించారు.
మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం కావటంతో ఉప ఎన్నికల్లోనూ అంతే స్థాయి మెజారిటీతో గెలవడానికి కృషి చేయాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా వారికి సూచించారు. అభ్యర్థి ఎవరైనా సరే గెలుపే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. తొలి నుంచి ఉద్యమంలో ఉన్న వారికి, ఎవరి వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందో వారికే టికెట్ ఇస్తామనే సంకేతాలను కేసీఆర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. మెదక్ లోకసభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ను ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్కు టికెట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్పై ఒత్తిడి పెంచుతున్నారు.
ఇప్పటికే టికెట్ రేసులో ఉన్న పార్టీ నేతలు మైనంపల్లి హన్మంత రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, రియల్టర్ ప్రవీణ్ రెడ్డితోపాటు, తొలి నుంచి టీఆర్ఎస్ అధినాయకత్వానికి విధేయుడిగా ఉన్న పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కేసీఆర్ నుంచి ఎమ్మెల్సీ హామీ పొందిన కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, పార్టీ మెదక్ జిల్లా ఇన్చార్జీ రాజయ్య యాదవ్లు టికెట్పై కోటి ఆశలు పెట్టుకున్నారు.