కేసీఆర్కు కొత్త తలనొప్పి!: భద్రాచలం జిల్లాకు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని చూస్తున్న నేపథ్యంలో... కొత్త జిల్లాల కోసం పలుచోట్ల డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది తెరాస సర్కారుకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టవచ్చునని అంటున్నారు. తొలి విడతగా ఏడు జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు రాగానే మెదక్ను జిల్లా కేంద్రంగా చేయాలని బంద్ చేశారు. తాజాగా ఖమ్మం జిల్లాలో కొత్త జిల్లా డిమాండ్ రాజుకుంటోంది.
నియోజకవర్గాల పునర్విభజన అయ్యే వరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. అయినప్పటికీ తమ ప్రాంతాన్నే జిల్లా చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. వనపర్తి, మంచిర్యాలలాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక జిల్లా డిమాండ్ ఊపందుకుంది.
ఖమ్మం జిల్లాలోని భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న కొత్తగూడెం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలంలో కొత్త జిల్లా ఏర్పాటుకు ఉద్యమం ప్రారంభమైంది.
జిల్లా హోదా భద్రాచలానికే దక్కాలంటూ భద్రాచలం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భద్రాచలం అభివృద్ధిలో బాగా వెనుకబడిందని, కాబట్టి తమ ప్రాంతాన్నే ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్తో ఉద్యమానికి సిద్ధమయ్యారు. భద్రాచలంను జిల్లా చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇప్పటికే కేసీఆర్కు లేఖ రాశారు. వనపర్తి ఎమ్మెల్యే జీ చిన్నారెడ్డి కూడా ప్రత్యేక జిల్లా కోసం దీక్ష చేస్తున్నారు.