జగన్ దొంగలేఖ: దేవినేని, చూపించాలని వాసిరెడ్డి సవాల్
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగలేఖలు పంపిస్తోందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు చాలా బాగున్నారని, కొన్నేళ్లుగా వారికి వ్యవసాయంలో ఎటువంటి నష్టాలు రాలేదని ఆర్బీఐకి అబద్ధపు లేఖలు పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితులు బాగున్నాయని కలెక్టర్ల నివేదికలు స్పష్టం చేస్తున్నాయంటూ, వాటి నకళ్లను జగన్ నాంపల్లిలోని ఓ జిరాక్స్ కేంద్రం నుంచి ఆర్బీఐకు ఫ్యాక్స్లు పంపారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
తమ ప్రభుత్వం రుణమాఫీ నిర్ణయాన్ని అమలు చేస్తుండడం చూసి తట్టుకోలేకే వైయస్ జగన్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. జగన్ దొంగతనంగా ఆర్బీఐకు లేఖలు పంపాల్సిన అవసరం లేదని, నేరుగా సాక్షి టీవీ, పేపర్ ద్వారా పంపొచ్చని ఆయన ఎద్దేవా చేశారు.
దమ్ముంటే నిరూపించండి: వాసిరెడ్డి పద్మ
రిజర్వ్ బ్యాంక్కు దొంగ నివేదికలు పంపినట్లు దేవినేని చేసిన ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. ఊరికే ఆరోపణలు చేయడం కాదని, దమ్ము, ధైర్యం ఉంటే ఆర్బీఐకు తాము నివేదికలు అందజేసినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, రైతులను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి దిగజారుడు ప్రచారానికి టీడీపీ పాల్పడుతోందన్నారు.