మతిలేని మాటలు: జగన్ను దులిపేసిన దేవినేని
అనంతపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవాలను సాధనల ద్వారా ప్రజలకు వివరించడమే ఆ చానళ్లు చేశాయని, అంతేగానీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారమిచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చానళ్లు, పత్రికలపై ఆడిపోసుకోవద్దని, నీ అహంకారం.. నీ చేతగాని తనం, నీ అరాచకత్వాలను ప్రజలు వద్దనుకున్నారని, కాబట్టే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు.
‘నీవు అసమర్థుడవు... రాష్ర్టాన్ని కాపాడలేవు అని ప్రజలు విశ్వసించారు కాబట్టే చంద్రబాబు విశ్వసనీయతకు ఓటేశారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుందని ప్రజలు నమ్మారు. ఈ విషయాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోవడం మంచిది కాద'ని హితవు పలికారు. బీసీల అభ్యున్నతి గురించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే ఆ వర్గాల గురించి నోరు విప్పని జగన్కు బడుగుల జిల్లాలోకి వచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అవకాశమిస్తే అసమర్థనాయకుడయ్యారని ఎద్దేవా చేశారు.
ఇదిలావుంటే, అంతకు ముందు హంద్రీనీవా అధికారులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రి దేవినేని సమీక్ష చేశారు. కృష్ణా మిగులు జలాలన్నింటినీ రాయలసీమ ప్రాంతానికే రానున్న ఏడాదిలోపు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. హంద్రీనీవాకు రూ. 6,700 కోట్లు ఖర్చు పెట్టి మూడు మోటార్లు ఆడించేందుకు భయపడుతున్నారంటే, అందుకు పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సిగ్గు పడాలని మంత్రి అన్నారు.