జగన్ తన బాధ్యత నిర్వర్తించారు: ధర్మాన, బాబుకు ప్రశ్న
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వంతు బాధ్యతను నిర్వర్తించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షమే ప్రశ్నిస్తుందని అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని ధర్మాన ప్రసాద రావు చెప్పారు. బడ్జెట్లో ఉన్న తప్పులు, లోపాలను ఎత్తి చూపడాన్ని మీరు అంగీకరించలేరా అని ప్రశ్నించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు బడ్జెట్పై స్పష్టత ఇవ్వాలి కానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చంద్రబాబుకు సూచించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించడం చంద్రబాబుకు తగదని ధర్మాన ప్రసాద రావు హితవు పలికారు. తప్పులను ప్రశ్నించడానికి అనుభవం కావాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని ధర్మాన సూచించారు.