రెచ్చగొట్టొద్దు: కెసిఆర్కు డొక్కా, టిడిపి గేమ్: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు డొక్కా మాణిక్య వర ప్రసాద రావు, శైలజానాథ్లు శుక్రవారం మండిపడ్డారు. ఉద్యోగులను భయపెట్టే సంస్కృతిని కెసిఆర్ వీడాలన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తించాలని హితవు పలికారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవన్నారు.
తాము ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా హక్కులు కలిగిన సీమాంధ్ర ఉద్యోగులకు హైదరాబాదులో ఉండే హక్కు కూడా ఉందన్నారు. సీమాంద్ర ఉద్యోగులు ఎక్కడకూ వెళ్లరని, ఇక్కడే ఉంటారన్నారు. కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందించాలన్నారు. ఉద్యోగుల విషయంలో కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు బెదిరించేలా ఉన్నాయన్నారు. కెసిఆర్ బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారని, వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
టిడిపి మైండ్ గేమ్: ఉమ్మారెడ్డి
తమ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారంటూ ఆ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం అన్నారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలోకి వెళ్లరన్నారు. తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుండి గుర్తింపు వస్తుందని చెప్పారు.
శనివారం లేదా సోమవారం దీనిపై స్పష్టత వస్తుందన్నారు. రుణమాఫీ పైన టిడిపి మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం రుణ మాఫీ పైన చేయాలన్నారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 67 ఎమ్మెల్యేలను, తొమ్మిది లోకసభ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. త్వరలో పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు రానుంది.