మీ లేఖ పత్రికలో రాస్తే తప్పా, కేసీఆర్ని వదలం: కిషన్
హైదరాబాద్: పత్రికల పైన నిందలు వేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఎల్ అండ్ టీ సంస్థలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి హితవు పలికారు. రెండో రోజులుగా మెట్రో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై గురువారం కిషన్ రెడ్డి స్పందించారు.
ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ వాస్తవాలు కప్పిపుచ్చి పత్రికల పైన నిందలు వేయవద్దన్నారు. వాస్తవాలు ప్రచురించే హక్కు పత్రికలకు లేదని ఎలా అంటారన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకుంటే ఏమీ లేదు కానీ పత్రికలో వస్తే తప్పా అని ప్రశ్నించారు. విమోచన దినోత్సవాన్ని జరపకుండా ప్రభుత్వం తమను అడ్డుకుందన్నారు.
విమోచన దినోత్సవం పైన కేసీఆర్ పదేపదే మాట తప్పుతున్నారని విమర్శించారు. అధికారికంగా విమోచన దినోత్సవం జరిపే వరకు వదిలిపెట్టమన్నారు. బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఎల్ అండ్ టీ భారీగా ఖర్చు పెట్టిందని, ప్రభుత్వ విధానం వల్ల మెట్రో పనులు ఆగిపోతున్నాయన్నారు.
లేఖలో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు. మెట్రో పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారో బయటకు రావాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.