జాగ్రత్త, రాజకీయాలొద్దనుకున్నాం: 'సానియా'పై హరీష్
హైదరాబాద్: సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమించటాన్ని రాజకీయం చేయటం భారతీయ జనతా పార్టీ నాయకుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని, మీరు ఒక్కటి అడిగితే తాము పది అడుగుతాం.. జాగ్రత్త అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తాము ఈ నాలుగేళ్లు రాజకీయాలు మాట్లాడవద్దని అనుకున్నామన్నారు.
అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న తమకు విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. పక్కలో బల్లెంలా ఆంధ్రప్రదేస్ నుండి వస్తున్న సమస్యలను అందరం సమష్టిగా ఎదుర్కొందామని హితవు పలికారు.
మీ పార్టీ అధిష్ఠానాలను మెప్పించటానికి తమ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన విమర్శలు చేయడం సరికాదని, ప్రజలలో నగుబాటుకు గురువుతారన్నారు. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరన్నారు. మీరు మాకు ఒక్క ప్రశ్న వేస్తే, మేం మీకు పది ప్రశ్నలు వేస్తాం... జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
గజ్వేల్లో లోకేష్ పర్యటన
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్ బుధవారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఈ సందర్భంగా లక్ష రూపాయల చొప్పున అందజేస్తారని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కె ప్రసాద్ తెలిపారు. లోకేష్.. తూప్రాన్ మీదుగా ఇస్లాంపూర్, గున్రెడ్డి పల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్, ఘనపూర్, వేలూరు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను కలుస్తారనిపేర్కొన్నారు.