శోభా నాగిరెడ్డి పేరు ఉంచడం సరైందే: ఈసి వాదన
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాలో శోభానాగిరెడ్డి పేరును అలానే ఉంచడంపై తన చర్యను కేంద్ర ఎన్నికల కమిషన్ సమర్ధించుకుంది. పోలింగ్కు ముందే వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థిగా ఆమె పేరు తొలగించకుండా ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్నూలుకు చెందిన బి హర్షవర్ధన్రెడ్డి, జె వినోద్కుమార్రెడ్డి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.శోభానాగిరెడ్డి మరణించినందున ఆమె తరువాత ఓట్లు పొందిన వారిని విజేతగా ప్రకటించాలని కోరారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం 52 సెక్షన్ ప్రకారం నిబంధనల మేరకే శోభానాగిరెడ్డి పేరును అభ్యర్థుల జాబితాలో అలానే ఉంచినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ అఫిడవిట్ సమర్పించింది. సెక్షన్ 52 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత గుర్తింపు పొందిన పార్టీ, గుర్తింపు లేని పార్టీ అనే తేడా ఉండదని అభ్యర్థులంతా ఒకటేనని ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఏప్రిల్ 24న శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. మే 7న జరిగిన పోలింగ్లో ఆమె విజయం సాధించినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బ్యాలెట్ పత్రాలు రూపొందించిన తరువాత గుర్తింపు పొందిన పార్టీ, గుర్తింపు పొందని పార్టీ అనే తేడా ఉండదని, దీనిని దృష్టిలో పెట్టుకొని పిటీషన్ కొట్టివేయాలని ఎన్నికల కమిషన్ కోర్టును కోరింది.
జస్టిస్ కెసి భాను, జస్టిస్ అనిస్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆళ్లగడ్డ నియోజక వర్గానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.