బెజవాడలో భూమి లేదు: ఎపి రాజధానిపై నారాయణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్పై కసరత్తు చేయాలని అనుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మంగళవారం సచివాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నెల రోజుల లోపల పాలసీ ప్రకటించి, ఏడాదిలోపు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. విజయవాడలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, 50 వేల ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ జరుపుతామని నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులకే లాభమని ఆయన చెప్పారు. అభివృద్ధి చేసిన తర్వాత పెరిగిన విలువలో భూమి యజమానులకు వాటా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణం సహా సామాజిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన అన్నారు. భూ సేకరణపై ఇతర రాష్ట్రాల ప్రక్రియను పరిశీలించామని, వచ్చే నెలలో విదేశాల్లో కూడా పర్యటిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. భూముల సేకరణ విలువలు కూడా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ చేసే విషయంలో రైతులకు నష్టం కలగకూడదనే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.
రాజధాని ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలు ఏ విధంగా భూమిని సేకరించాయో పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. నయా రాయపూర్లో భూముల ధర ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని రాజధాని నిర్మాణాల్లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుంటున్నామని ఆయన చెప్పారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాత రాజధానిని జోన్లుగా విభజించాల్సి ఉంటుదని, వివిధ రాష్ట్రాల్లోని రాజధానులను చూస్తే దాదాపు 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారని ఆయన చెప్పారు.