తాగుబోతు టిఆర్ఎస్, కృష్ణయ్యే సిఎం: బాబు, గుడ్ల దాడి
అదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిప్పులు చెరిగారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టిడిపిని గెలిపిస్తే బిసిలను ముఖ్యమంత్రిని చేస్తానని, బిసి ముఖ్యమంత్రిగా ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తున్న బి కృష్ణయ్యను చేస్తానని ప్రకటించారు.
తమది అభివృద్ధివాదమైతే తెరాసది దోపిడీవాదమని, వసూళ్ల వాదమని ఎద్దేవా చేశారు. ఖబడ్దార్ కెసిఆర్ అని హెచ్చరించారు. తెలంగాణలో తిరగొద్దు జాగ్రత్త అన్నారు. తెరాసలో పనికిరాని వ్యక్తులు అని ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో నారా లోకేష్ ప్రచారం చేస్తుంటే.. కొందరు తాగేసి వచ్చి బీరు బాటిల్ విసిరారన్నారు. అదో తాగుబోతుల పార్టీ అన్నారు. తెరాసది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమన్నారు. నాడు సామాజిక న్యాయం కోసం కెసిఆర్కు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.
తెరాస ప్రజలను అయోమయంలో పడేస్తుందన్నారు. కెసిఆర్ ఎన్నిసార్లు అబద్దామడతారని ప్రశ్నించారు. అదిలాబాద్ జిల్లాను, తెలంగాణను, హైదరాబాదును అభివృద్ధి చేసింది టిడిపియే అన్నారు. సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మించింది తానేనని చెప్పారు. కెసిఆర్ది పెత్తందారుతనమన్నారు. అబద్దాలు చెప్పడమే ఆయన పని అన్నారు. ఈ దేశానికి మొదటిసారి మోడీ రూపంలో బిసి ప్రధాని వస్తున్నారన్నారు.
కాంగ్రెసుకు సురవరం
పొత్తు నేపథ్యంలో తమకిచ్చిన స్థానాల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థులను తప్పించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కోరారు. మహేశ్వరం, మునుగోడు, ఎల్లంపల్లిలో సిపిఐ అభ్యర్థులనే పోటీలో ఉంచాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ రోజు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నరేంద్ర మోడీని ప్రధాని చేయడానికి కార్పొరేట్ సంస్థలు వేలకోట్లు ఖర్చు పెడుతున్నాయన్నారు. టివి ఛానల్స్ లో తప్ప మోడీ హవా ఎక్కడా లేదని సురవరం చెప్పుకొచ్చారు.