చంద్రబాబు షాకిస్తారా: విద్యుత్ ఛార్జీల పెంపు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయని తెలుస్తోంది. జనవరి 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు కేబినెట్ సమావేశమవుతుంది. విద్యుత్తు చార్జీల పెంపుపై, ఓడరేవుల నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
మచిలీపట్నం, నిజాంపట్నంలలో పోర్టులు నిర్మిస్తే వాటి మధ్య కనెక్టివిటీపై చర్చలు జరగనున్నాయి. విద్యుత్తు చార్జీల టారిఫ్ పెంపుపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నారు. మారిటైం బోర్డు ఏర్పాటుపైనా చర్చించనున్నారు. తాజాగా అమలులోకి వచ్చిన క్రీడ పరిధులు, రైతుల నుంచి భూ సమీకరణ, హామీ పత్రాల జారీ తదితర అంశాలతో పాటు మరి కొన్నింటిపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
చంద్రబాబుతో సచివాలయంలో బుధవారం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్జైన్, ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ భేటీ అయ్యారు. ఇంధనచార్జీల సవరణపై ప్రాథమికంగా చర్చించారు. విద్యుత్తు చార్జీలను సవరించాల్సిన అవసరం ఉందని ఇంధన శాఖ అధికారులు బాబుకు వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలోని డిస్కంల ఆర్థికస్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, పులి మీద పుట్రలా ఈపీఎస్పీడీసీఎల్కు హుద్హుద్ నష్టాలను మిగిల్చిందని వారు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నష్టాలను పూడ్చుకోవాలంటే ఇంధన చార్జీలను సవరించాల్సిన అవసరం ఉందని వివరించారు.