లవర్స్తో గుంజీళ్లపై విచారణ, తాగి చిందేసిన జుడాలపైనా
హైదరాబాద్/కాకినాడ: ప్రేమజంటలతో గుంజీళ్లు తీయించిన ఘటనపై పశ్చిమ మండల డిసిపి సత్యనారాయణ మంగళవారం విచారణకు ఆదేశించారు. చారిత్రాత్మకమైన గోల్కొండ కోట, సెవన్ టుంబ్స్ను సందర్శించేందుకు వచ్చిన ప్రేమ జంటలను పోలీసులు గుంజీళ్లు తీయించిన అంశం వివాదాస్పదమైంది. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిసిపి ఆసిఫ్ నగర్ పోలీసులను ఆదేశించారు.
పోలీసులు అతిగా ప్రవర్తించారని విమర్శలు వెల్లువెత్తగా, ఈ ఘటనపై ప్రజా సంఘాలు మానవ హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశాయి. కాగా, చారిత్రాత్మకమైన గోల్కొండ కోట, సెవన్టూంబ్స్ను సందర్శించేందుకు వచ్చిన ప్రేమ జంటలను గోల్కొండ పోలీసులు గుంజిళ్లు తీయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదిహేను రోజుల క్రితం గోల్కొండ కోట, సెవన్ టూంబ్స్ను సందర్శించేందుకు వచ్చిన ప్రేమ జంటలను పోలీసులు కౌనె్సలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే యువతి, యువకులు వ్యసనాలకు గురికాకుండా వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా గోల్కొండ కోట సందర్శనకు వచ్చే ప్రేమ జంటల చేష్టలు అసభ్యంగా ఉంటున్నాయని పర్యాటకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోల్కొండ పోలీసులు ప్రేమ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి పనులు ఇక ముందు చేయకుండా వారిని గుంజిళ్లు తీయించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై ఫిబ్రవరి 2వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్ను హెచ్చార్సీ ఆదేశించింది.
జూనియర్ వైద్యుల నిర్వాకం పైనా..
మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యుల నిర్వాకం పైనా సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ఓ జూనియర్ వైద్యుడి పుట్టిన రోజు సందర్భంగా ఇరవై మంది మెడికోలు ప్రభుత్వాసుపత్రిలోని ఓ విభాగంలో తాగి తందనాలాడారు. మందు పార్టీ చేసుకొని, టెర్రస్ పైన మద్యం సేవించి ఆ మైకంలో అరుపులు, కేకలు వేయడంతో రోగులు భయపడిపోయారు. దీనిపై విచారణకు ఆదేశించారు.