బాబుకు షాక్: కెసిఆర్తో అర్థరాత్రి ఎర్రబెల్లి రహస్య భేటీ
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు భూబదలాయింపుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా వెళ్లి ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్ను కలిశారు.
ఎర్రబెల్లి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ కలిగించే విషయమే. ఎర్రబెల్లి దయాకర్ రావు సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కెసిఆర్తో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. గన్మన్ కూడా తోడు లేకుండా అర్థరాత్రి పూట, ఒంటరిగా, రహస్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్ వద్దకు వెళ్లారు.
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోందనే విషయాన్ని తెలుసుకోవడానికి కెసిఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావును పిలిపించుకున్నారని కొంత మంది అంటుండగా, రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా వెళ్లి కెసిఆర్ను కలుసుకున్నారని మరి కొంత మంది అంటున్నారు.
ఎర్రబెల్లి సిఎం క్యాంపు కార్యాలయానికి రావడానికి కొద్దిసేపు వెనకా ముందర కెసిఆర్కు సన్నిహితుడైన దామోదర రావు, హైదరాబాద్ కలెక్టరేట్కు చెందిన కొంత మంది అధికారులు వచ్చి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.