కేసీఆర్ను కలిశా.. నిజమే, కానీ: ఎర్రబెల్లి, నిజం కాదని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తన భేటీ పైన వస్తున్న వార్తల పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం మరోసారి స్పందించారు. తాను కేసీఆర్ను కలిసింది వాస్తవమేనని, అయితే అది అర్ధరాత్రి కాదని చెప్పారు. తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
తాను పార్టీ మారాలనుకోవడం లేదని, తనను పార్టీ మారాలని కూడా ఎవరు కోరలేదన్నారు. తాము సాయంత్రం పూట కేసీఆర్ని కలిశామని, వేరే అంశం పైన చర్చించామన్నారు. కులం పేరుతో తిట్టడాన్ని తాను తప్పుపడుతున్నానని ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, కేసీఆర్తో భేటీ పైన ఎర్రబెల్లి సోమవారం కూడా స్పందించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుతో తాను సమావేశమైనట్లు వచ్చిన వార్తలను ఆయన సోమవారం ఖండించారు. గత అర్థరాత్రి తాను కెసిఆర్ను కలిసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మీడియాతో చెప్పారు.
ఎవరినో చూసి తాను అనుకుని ఓ పత్రిక వార్తాకథనాన్ని వెలువరించి ఉండవచ్చునని ఆయన అన్నారు. తాను ప్రయాణించినట్లు చెబుతున్న వాహనం కూడా తనది కాదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని వీడే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన అన్నారు.
అయితే, సోమవారం మాట్లాడినప్పుడు తాను అర్ధరాత్రి కలవలేదని చెప్పిన ఎర్రబెల్లి, తాను కలిసిన విషయాన్ని మాత్రం చెప్పలేదని అంటున్నారు. మంగళవారం తాను కేసీఆర్ను కలిసింది నిజమేనని, అయితే అర్ధరాత్రి కాదని చెప్పడం గమనార్హమని చెబుతున్నారు.