అది నిజమే, ఎవర్నో చూసి: కెసిఆర్తో భేటీపై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో తాను సమావేశమైనట్లు వచ్చిన వార్తలను తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. గత అర్థరాత్రి తాను కెసిఆర్ను కలిసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన సోమవారం మీడియాతో చెప్పారు.
ఎవరినో చూసి తాను అనుకుని ఓ పత్రిక వార్తాకథనాన్ని వెలువరించి ఉండవచ్చునని ఆయన అన్నారు. తాను ప్రయాణించినట్లు చెబుతున్న వాహనం కూడా తనది కాదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని వీడే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన అన్నారు.
టిడిపిని వీడాలనుకున్నవారు ఎన్నికలకు ముందే ఇతర పార్టీల్లో చేరిపోయారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారంపై తాను తమ పార్టీ నేత రేవంత్ రెడ్డితో విభేదించిన విషయం నిజమేనని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ప్ఱభుత్వం మీద రేవంత్ రెడ్డి ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆదివారం అర్థరాత్రి పూట రహస్యంగా కలిసినట్లు ఓ పత్రికలో వార్త వచ్చిన విషయం తెలిసిందే.