కబ్జా వ్యవహారం: మంత్రి ఈటెల భూమి హాంఫట్
వరంగల్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ భూమి కూడా కబ్జాకు గురైంది. అక్రమ భూకబ్జాల జోరుకు ఇది అద్దం పడుతుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లిలో ఈటెల రాజేందర్ భూమి కబ్జాకు గురైన ఉదంతంపై నమస్తే తెలంగాణ దినపత్రిక మంగళవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈటెల రాజేందర్కు దక్కాల్సిన వారసత్వ భూమి చాలా కాలంగా ఖాళీగా ఉంది. దాంతో రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పేరు తొలగించి స్వాహా చేశారు.
నమస్తే తెలంగాణ వార్తాకథనం ప్రకారం - బొల్లోనిపల్లి ఈటెల రాజేందర్ అమ్మమ్మ ఊరు. గ్రామానికి చెందిన బోళ్ల సాయిలుకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లలో మంత్రి ఈటెల రాజేందర్ తల్లి ఈటెల వెంకటమ్మ ఒకరు. సాయిలు ఆరుగురు సంతానం కోసం ఊరి శివారులోని రామచంద్రాపురం సరిహద్దు ప్రాంతంలో 1956లో 44 ఎకరాల భూమిని ఉమర్ ఖాన్ అనే వ్యక్తి నుంచి కొన్నాడు. 1976లో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి.
ఆ భూమిని తన వారసులైన ఆరుగురికి సమాన వాటాలుగా సాయిలు వీలునామా రాశారు. దీంతో ఈటెల రాజేందర్కు తల్లి వెంకటమ్మ వారసత్వ ఆస్తిగా ఏడు ఎకరాల భూమి రావాల్సి ఉంది. అయితే, ఇన్నాళ్లు ఉమ్మడిగా ఉన్న ఆస్తి కంచె కోసం, పశువుల మేత కోసం ఉమ్మడిగా వినియోగిస్తున్నారు. భూమి కొనుగోలు నాటి నుంచి రెవెన్యూ రికార్డుల్లో వస్తున్నా 2002 నుంచి అవి తారుమారయ్యాయి.
రెవెన్యూ అధికారుల్లో కొందరు దళారులతో కలిసి భూకబ్జా చేశారు. 44 ఎకరాల్లో 20 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఈటెల బావమరిది బోళ్ల వీరస్వామి తమకు చెప్పినట్లు నమస్తే తెలంగాణ రాసింది. ఈ వ్యవహారంపై ఈటెల రాజేందర్ కూడా అధికారులను నిలదీసినట్లు సమాచారం.