చంద్రబాబు పొలం పిలుస్తోంది: రైతులందరికీ ఐప్యాడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకూ ఐప్యాడ్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన నివాసంలో తనను కలిసేందుకు వచ్చిన రైతు ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ‘పొలం పిలుస్తోంది' పేరిట ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అందరికీ తిండి, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం కావాలంటే ప్రత్యేక డ్రైవ్లో శాస్తవ్రేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొనాలన్నారు.
భూసార పరీక్షలు, సాగుయోగ్యమైన పంటల నిర్ధారణ, మేలైన విత్తనాలు, ఎరువులు, అందజేయడం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు ఉపగ్రహ సమాచారాన్ని చేరువ చేసేందుకు ప్రతి రైతుకూ ఐప్యాడ్ అందిస్తామన్నారు. గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశాస్రీయ విధానాల వల్ల వ్యవసాయ పరిశోధనలు ఆగిపోయాయని విమర్శించారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు నిలచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులు పెంచకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
ప్రపంచంలోనే వ్యవసాయకంగా భారతదేశం ఎంతో వెనుకబడి ఉంటే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనుకబడి ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోయాయని, భూసార పరీక్షల నుండి రైతు శిక్షణ తరగతుల వరకూ అన్నింటినీ గత ప్రభుత్వాలు నిలిపివేశాయన్నారు. దీంతో రాష్ట్రంలో సేద్యం దేవు డిదయగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధన్యవాదాలు తెలిపిన రైతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతు నాయకులు, రైతులు మంగళవారం చంద్రబాబు నివాసానికి వచ్చి.. రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలో తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
పెండింగ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసి సాగునీటి సమర్ధ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు అన్నారు. భూమి సారవంతం చేసేందుకు జిప్సం, జింక్ పోషక లోపాల నివారణకు ఏటా 500 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని కరవురహిత ప్రాంతంగా మారుస్తామన్నారు.
చిత్తూరు జిల్లాకు మేలు
సోమశిల, కండలేరు ప్రాజెక్టుల ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయంపై వచ్చే రాబడి కన్నా రెండు మూడు రెట్లు అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న రంగాలు హార్టికల్చర్, సెరికల్చర్, డెయిరీ, ఫిషింగ్, ఫ్రౌల్ట్రీ, రొయ్యల పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
మాట్లాడుతున్న చంద్రబాబు
తనకు కృతజ్ఞతలు తెలిపేందుకు వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతు సంఘాల నేతలు, రైతులతో మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు.
ఆశలు చిగురించాయి
పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఆటంకాలు తొలగిపోవడంతో రైతాంగంలో కొంతమేర ఆశలు చిగురించాయని చంద్రబాబు అన్నారు. దీనివల్ల విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోందన్నారు. వంశధార, నాగావళి నదీ జలాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఆ ప్రాంత రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు.