స్నేక్ గ్యాంగ్పై కేసులు: పరీక్షలకు మెమొరీ కార్డులు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పాతబస్తీకి చెందిన స్నేక్ గ్యాంగ్పై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. హైదరాబాదులోని పహఢీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫామ్హౌస్లో కాబోయే భర్తను మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిని పాములతో బెదిరించి, వివస్త్రను చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు స్నేక్ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసింది.
ఆ కేసులో ప్రధాన నిందితుడు దయానీని, మరో నిందితుడ్ని తమ కస్టడీలోకి తీసుకుని మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ విచారణలో తమకు లభించిన ఆధారాలతో స్నేక్ గ్యాంగ్పై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. వీటిలో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
స్నేక్ గ్యాంగ్ వీడియోలను పరిశీలించిన పోలీసులు వాటి మెమొరీ కార్డులను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. వారినుంచి 9 మొబైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారికి సంబంధించి 15కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
భూకబ్జా వ్యవహారంలో ఓ వ్యక్తిని స్నేక్ గ్యాంగ్ కొట్టిన వీడియోను కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అలాగే, అంగన్ వాడీ టీచర్ను బెదిరించిన సంఘటన కూడా వారు వీడియో తీసినట్లు సమాచారం. అలాగే, ఓ మహిళను వివాహం చేసుకుని వేధించిన సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.
దయానితో పాటు మరో నిందితుడి కస్టడీ ముగియడంతో వారిని పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారి రిమాండ్ను పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.