నలుగురు అరెస్ట్: రూ.8లక్షల విదేశీ మద్యం సీజ్(ఫొటో)
హైదరాబాద్: అక్రమంగా రవాణా చేస్తున్న విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 8లక్షల విలువ చేసే 142 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను హైదరాబాద్ అబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ పి భగవాన్ రెడ్డి మీడియాకు తెలిపారు.
నరేష్ అనే వ్యక్తి హీరో హోండా(ఏపి 09సిఎస్ 7073)పై విదేశీ మద్యం బాటిళ్లను రవాణా చేస్తున్నాడనే సమాచారం మేరకు దాడి చేసి అతడి నుంచి 5 సీసాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం అతని ఇంటిపై దాడి చేయగా రవాణాకు సిద్ధంగా ఉన్న ఆటో రిక్షా(ఏపి 09వి 5856)లో 137 విదేశీ బాటిళ్లు, మిగతా ఐదు సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
నరేష్ తోపాటు నిందితులు శివపటేల్, మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ ఖాసీంలను అరెస్ట్ చేశారు. నాన్ డ్యూటీ పేయిడ్ విదేశీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతంలోనే శివ అక్రమ మద్యం రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. స్వాధీనం చేసుకున్న విదేశీ బాటిళ్లు ఒక్క సీసా రూ. 2 నుంచి 8వేల ఖరీదు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు చెప్పారు.
హైదరాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎంఎంఎ ఫారూఖీ, అసిస్టెంట్ కమిషనర్ భగవాన్ రెడ్డి, అధికారులు కృష్ణ, శ్రీనివాసరావు, కె. కరుణ, ఎస్ శ్రీనివాస్, పోలీసులు పాల్గొన్నారు.