అవును దాసరి గన్మెన్లను కోరారు: చినరాజప్ప
హైదరాబాద్: దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు గన్ మెన్లను కేటాయించాలని తనను కోరిన మాట వాస్తమేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప బుధవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. గన్ మెన్లను కేటాయించే విషయం భద్రతా కమిటీ చూసుకుంటుందని దాసరికి తాను వెల్లడించానని అన్నారు. రాష్ట్రంలోని ఏజెన్నీ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కూడా వారికి భద్రత పెంచాలని కోరారని చెప్పారు. ఆ విషయాన్ని భద్రత కమిటీ పరిశీలిస్తుందని వారికి తెలియజేశానని అన్నారు.
ఎవరికి భద్రత కల్పించాలి.. ఎవరికి కల్పించకూడదు అనే విషయంలో మా ప్రమేయం ఉండదని డిప్యూటీ సీఎం అన్నారు. దాసరి నారాయణ రావు గతంలో కేంద్ర బొగ్గు శాఖ మాజీ సహాయమంత్రిగా పని చేశారు. దాసరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఇటీవల దాసరి నారాయణ రావుకి భద్రతగా ఉన్న గన్ మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో తనకు గన్ మెన్ల భద్రత కావాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను దాసరి కోరారు.
దాసరి నారాయణ రావు కేంద్ర బొగ్గు శాఖ మాజీ సహాయమంత్రిగా పని చేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు సిబిఐకి విచారణలో వెల్లడించారు.
స్క్రీనింగ్ కమిటీ తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్కు తలబిరా-2 బొగ్గు బ్లాకుల్ని కేటాయించిందని, తాను అదే నిర్ణయాన్ని సమర్థించానని దాసరి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీలో వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారని, వారి నిర్ణయమే అంతిమమన్నారు. బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తాను నిరపరాధిగా తేలుతానని అన్నారు.