దారుణం: నెలపాటు అంధ యువతిపై గ్యాంగ్రేప్
నల్గొండ/కర్నూలు: కఠినమైన చట్టాలు వచ్చినా యువతులు, మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ అంధ గిరిజన యువతిపై నలుగురు కామాంధులు దాదాపు నెల రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్గొండ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామ శివారు మురికి తాండాకు చెందిన చెందిన ఓ అంధురాలైన యువతి(21) హైదరాబాద్లోని ఓ హాస్టల్ ఉంటూ డిగ్రీ చదువుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన మణిరాజు అనే యువకుడు, తన భార్య ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మణిరాజు పాక్షికంగా అంధుడు కాగా, అతని భార్య పూర్తిగా అంధురాలు. నెల కిందట మణిరాజు బాధిత యువతిని హైదరాబాద్ నుంచి కర్నూలుకు వాహనంలో తీసుకెళ్లాడు.
మార్గమధ్యలో అతను తన ఇద్దరు మిత్రులు శివ, సందీప్లను తన వాహనంలో ఎక్కించుకున్నాడు. శివ, సందీప్లు అంధులు కాదు. దారిలో ముగ్గురూ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కూడా ఇంట్లో నిర్బంధించి పలుమార్లు ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతరం మణిరాజు చిన్నాన్న రఘు ఇంటికి ఆ యువతిని తీసుకెళ్లారు. రఘు కూడా వారితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కాగా, తమ కూతురు హాస్టల్లో లేకపోవడం, ఇటు ఇంటికీ రాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 2న ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు దృష్టికి విషయం వెళ్లడంతో.. ఆయన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. దేవరకొండ డిఎస్పీ, నాంపల్లి సిఐ, ఎస్సైలు విచారణ కొనసాగించారు.
బాధిత యువతి సెల్ఫోన్ నెంబరు ఆధారంగా నిందితులు కర్నూలులో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లారు. అక్కడ బాధితురాలు, ఆమెపై అత్యాచారం చేసిన నలుగురు నిందితులు మణిరాజు, శివ, సందీప్, రఘులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను సోమవారం సాయంత్రం దేవరకొండ మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చారు.