కడుపు మంట: జగన్పై గాలి, పిల్ల చేష్టలన్న బొజ్జల
హైదరాబాద్: పిల్ల చేష్టలు చేస్తే రైతులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధిచెబుతారని టిడిపి సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. దిష్టిబొమ్మలు తగలేయండని జగన్ అనడం సరికాదని ఇలాంటి చర్యలను జగన్ మానుకోవాలని అన్నారు.
అంతకుముందు గాలి ముద్దుకృష్ణమనాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ.. రుణమాఫీ చేస్తామంటే , ఎవరూ చేయలేరని జగన్ ఆనాడు అన్నారని ఇపుడు చంద్రబాబునాయుడు చేస్తానంటే ఆయనను విమర్శిస్తున్నారని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రూ. లక్ష మాఫీ చేస్తే ఏపి సిఎం చంద్రబాబునాయుడు లక్షన్నర మాఫీ చేశారని జగన్ తెలుసుకోవాలని అన్నారు. ఇంత వెసులుబాటుగా రుణమాఫీ దేశంలో ఎక్కడా లేదని అన్నారు.
16వేల కోట్ల రూపాయిల లోటు ఉన్నా చంద్రబాబునాయుడు 45వేల కోట్ల రూపాయిల రుణమాఫీ చేయడం రికార్డు అని గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. ఒక మంచి పని చేసినపుడు అభినందించాల్సింది పోయి విమర్శలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు, మహిళలు పండుగ చేసుకుంటుంటే జగన్ కడుపు మంటతో వ్యవహరిస్తున్నారని చెప్పారు.