టిడిపి గెలుస్తుందనే: జగన్ పార్టీపై గాలి, బాబుపై విహెచ్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఖాయమనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ న్యాయవాది ఫలితాల నిలుపుదల కోసం కోర్టును ఆశ్రయించారని టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మంగళవారం ఆరోపించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన వైయస్ జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.
ఒక్క తెలుగుదేశం పార్టీతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపితో టిడిపి పొత్తు ఉంటుందన్నారు. టిడిపికి ఒక ప్రభంజనం వచ్చేసిందని జగన్ పార్టీ న్యాయవాది మల్లికార్జున రెడ్డి భావిస్తూ మున్సిపల్ ఫలితాలను ఆపమని కోర్టును ఆశ్రయించారన్నారు. అంతే తప్ప ఫలితాలు ఆపమని టిడిపి కోర్టుకు వెళ్లలేదన్నారు. జగన్ పార్టీ ఓ ఛానల్కు డబ్బులిచ్చి బోగస్ సర్వేను నిన్న ప్రసారం చేయించారని విమర్శించారు.
చంద్రబాబుపై విహెచ్
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వేరుగా మండిపడ్డారు. తెలంగాణలో బిసిసిని సిఎం చేస్తానన్న చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరన్నారు. బిసిలు మైనార్టీలకు కాంగ్రెసు ద్వారానే న్యాయం అన్నారు. మైనార్టీలకు బాబు తాయిలాలు ప్రకటించడంపై విహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు సామాజిక న్యాయం అంటే ఎవరు నమ్మరన్నారు.
టిడిపి, బిజెపి పొత్తు అనైతికమన్నారు. ముస్లింలను ఊచకోత కోసిన నరేంద్ర మోడీని ప్రధాని చేయడానికి బాబు తహతహలాడుతున్నారన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కెసిఆర్ ముందుకు రావడం లేదన్నారు.