సర్వే: వంద శాతం కోసం వారం గడువు, కేంద్రం జోక్యం..!
21 లక్షల కుటుంబాలు హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించామని, వారికోసం ఇప్పటికే సర్వే స్టేషనరీ ముద్రించామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో వంద శాతం సర్వేకోసం ప్రభుత్వాన్ని వారం రోజుల గడువు కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో ఉదయం వరకు సర్వే కొనసాగిందన్నారు. జీహెచ్ఎంసీలో సవాల్గా స్వీకరించిన సర్వే విజయవంతమైందన్నారు.
సర్వేపై కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవచ్చు!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయమై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పరస్పర వాదోపవాదాలు చోటు చేసుకోవచ్చునని, కేంద్ర హోంశాఖ.. ఈ సర్వేలో జోక్యం చేసుకోవచ్చునని హోంశాఖలోని ఓ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
సర్వే వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై కేంద్రం దృష్టి పెట్టిందని ఆ అధికారి చెప్పారట. తగిన సమయంలో తగిన విధంగా హోంశాఖ జోక్యం చేసుకుంటుందని, మంచి నిర్ణయాలే తీసుకుంటారని, ఉద్రిక్తతలను పెంచే పనేమీ తెలంగాణ ప్రభుత్వం చేయదని ఆశిస్తున్నామని చెప్పారట.