రాష్ట్రపతి పాలనపై ప్రజలకు గవర్నర్: కిరణ్ నిర్ణయాలపై...
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారని, రాష్ట్రపతి ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరిస్తున్నానని, అందరు తనకు సహకరించాలని గవర్నర్ నరసింహన్ ఆదివారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం రాజ్ భవన్ నుండి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు ప్రభుత్వ వ్యవహారాలను కట్టబెట్టారని చెప్పారు
తెలుగు వారు వివేకవంతులు, ఆలోచనపరులు, అవగాహనపరులు అన్నారు. రాష్ట్రపతి పాలన సమయంలో అందరికీ సమన్యాయం జరిగేలా తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. విద్యారంగం సాఫీగా సాగేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. వైద్యం అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుత వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేస్తామని, పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు యథావిథిగా కొనసాగుతాయన్నారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఎపి స్వర్ణభూమి అని, పెట్టుబడులు వచ్చేందుకు కృషి జరగాల్సి ఉందన్నారు.
రాష్ట్రపతి ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రైతాంగ సమస్యలు తన దృష్టిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పౌరులందరికీ బాధ్యత ఉంటుందన్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటామన్నారు.
లక్ష్య సాధనలో తనకు అందరు తోడ్పడాలన్నారు. ప్రజల సంపూర్ణ సహకారంతో ముందుకెళ్తానని చెప్పారు. అభివృద్ధి అనేది అత్యంత ప్రధానమైన అంశమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమన్నారు. సమస్యలు ఉంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. ఏ విధమైన అంతరాయం కలిగించవద్దన్నారు. అభివృద్ధి విషయంలో రాజీపడమన్నారు.
జిల్లాల వారిగా అవసరాలను, అవకాశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. మీడియా విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని గణాంకాల ప్రకారం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
సలహాదారుల నియామకంపై సమాచారం లేదన్నారు. త్వరలో విశ్వవిద్యాలయాల్లో విసిలను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చివర్లో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షకు కొంత సమయం కావాలన్నారు. శాసన మండలి ఎంపికకు సంబంధించి ముఖ్యమంత్రి లేఖపై నిబంధలన ప్రకారమే చర్యలు ఉంటాయన్నారు.
కిరణ్ నిర్ణయాలపై విచారణ జరపాలి: గాలి
కిరణ్ కుమార్ రెడ్డి చివర్లో పెట్టిన సంతకాల పైన గవర్నర్ నరసింహన్ పూర్తిస్థాయి విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విజ్ఞప్తి చేశారు.