బెజవాడ తూర్పు తెరపైకి హరికృష్ణ, పెనమలూరుకి లాబీ
హైదరాబాద్/విజయవాడ: తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లాలోని పలు అసెంబ్లీ సీట్ల పైన రగడ కొనసాగుతోంది. విజయవాడ తూర్పు సీటు కోసం కొత్తగా నందమూరి హరికృష్ణ పేరు తెర పైకి వస్తోంది. అదే సమయంలో కొందరు నాయకులు హరిని పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్ద రాయబారం నెరపుతున్నారట.
విజయవాడ తీర్పు నియోజకవర్గం నుండి గద్దె రామ్మోహన్ రావు పోటీ చేస్తారని, బాబు ఆయనకు బిఫాం ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఇప్పటి వరకు బిఫాం ఆయన చేతికి రాలేదు. గద్దె రామ్మోహన్ ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
మరోవైపు తమను పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇవ్వలేదని యలమంచిలి రవి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. పెనమలూరు నుండి నందమూరి హరికృష్ణను పోటీ చేయించాలని టిడిపిలోని ఓ వర్గం చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తోందట.
పెనమలూరు టిక్కెట్ ప్రసాద్కు ఇచ్చారు. దీనిపై గుర్రుగా ఉన్న వర్గం బాబు వద్ద హరి కోసం లాబీయింగ్ చేస్తోందట. హరికృష్ణ విజయవాడ తూర్పు లేదా పెనమలూరు నుండి ఆఫర్స్ వస్తున్నాయి. కాగా, యలమంచిలి రవి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కొవ్వూరులో కలవనున్నారు.
బాబుతో రఘురామ, గోకరాజు భేటీ
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడును గోకరాజు రంగరాజు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రఘురామ కృష్ణం రాజులు వేర్వేరుగా కలిశారు.