అల్పుడు, టిలో లేరా: జైరాం, బాబులను ఏకేసిన హరీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ కాంగ్రెసు, కేంద్రమంత్రి జైరాం రమేష్, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి నేత వెంకయ్య నాయుడుల పైన సోమవారం నిప్పులు చెరిగారు. ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కెసిఆరేనని, ఉద్యమం అనే పదానికి కాంగ్రెసు నేతలకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు. జైరాం రమేష్ అల్పుడిగా మాట్లాడుతున్నారని, ఎవరో ఇచ్చిన స్క్పిప్ట్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు.
దొరలను పక్కన కూర్చో బెట్టుకొని దొరల పాలన వద్దని చెప్పడం విడ్డూరమన్నారు. పొన్నాల, జైరాంలకు కెసిఆర్ను విమర్శించే హక్కు లేదన్నారు. పొన్నాల గ్రామం ఖిలాషాపురం, కెసిఆర్ గ్రామం చింతమడుగు వెళ్లి ఎవరేం చేశారో తెలుసుకుందామా అని సవాల్ విసిరారు. జైరంకు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు. తెలంగాణకు కాంగ్రెసు పార్టీ కమిటీల పేరుతో అడుగడుగునా మోసం చేసిందన్నారు. కెసిఆర్ పైన విమర్శలు చేస్తే సూర్యుడి పైన ఉమ్మేసినట్లే అన్నారు.
కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు బిసిలకు ఎప్పుడైనా పదవి ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీకి కెసిఆర్, తెరాస అంటే భయమన్నారు. కెసిఆర్ ఆస్తుల పైన విచారణకు తాము సిద్ధమన్నారు. కాంగ్రెసు తప్పులు ఎత్తి చూపితే తాము అవినీతిపరులమా అని ప్రశ్నించారు. ఎవరేం చేసినా తెరాస ప్రభుత్వమే రానుందన్నారు. తెలంగాణలో కులాలకు అతీతంగా ఉద్యమాలు జరిగాయన్నారు. మిలియన్ మార్చ్ సమయంలో కాంగ్రెసు నేతలు ఎక్కడ ఉన్నారన్నారు.
చంద్రబాబుపై నిప్పులు
చంద్రబాబుకు సీమాంధ్ర దురహంకారం తగ్గినట్లు లేదన్నారు. పోరాటం చేసి ప్రజల మధ్య ఉన్న కెసిఆర్ తప్పు చేశాడా లేక అనునాయులకు భూములు పంచిన బాబు తప్పు చేశాడా అని ప్రశ్నించారు. తెలంగాణలో పది సీట్లు గెలుస్తామని, ఇన్ని స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంటామని బాబు చెప్పగలరా అని సవాల్ విసిరారు. సీమాంధ్రలో అధికారం కోసం నానా గడ్డి కరుస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీది దొంగల పార్టీ అని, అందులో నుండి వచ్చిన నలభై మంది దొంగల్లో ఇరవై మందికి టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణలో ఎలాగు టిడిపి గెలవదని, సీమాంధ్రలోను అధికారంలోకి రాకుంటే పిచ్చెక్కడం ఖాయమన్నారు. తెలంగాణలో ప్రచారం చేయడానికి టిడిపి తెలంగాణ నేతలు, కార్యకర్తలు లేరా అని ప్రశ్నించారు. ఇక్కడకు కూడా చంద్రబాబు రావాలా అని ప్రశ్నించారు. కెసిఆర్ దొరే అయితే 2009లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాము ఎలాంటి అంశం పైనా అయినా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.
ఉద్యోగులు, పోలవరం ముంపు మండలాలు, పోలవరం డిజైన్ మార్పు పైన ఇప్పటి వరకు టిడిపి, కాంగ్రెసు పార్టీలు తమ వైఖరి చెప్పలేదన్నారు. వెంకయ్య కూడా మాట్లాడే వాడు అయిపోయాడన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అడిగిన వెంకయ్య తెలంగాణకు ఎందుకడగలేదన్నారు. చంద్రబాబు, వెంకయ్యలు చివరి వరకు తెలంగాణను అడ్డుకోవాలని చూశాయన్నారు.