పవన్కళ్యాణ్, మోడీ ఇమేజ్పై హరీష్: జనం లెక్కా:జగన్
గుంటూరు/మెదక్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం కోసం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు తమ ఇమేజ్ను ఫణంగా పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్ జిల్లాలో అన్నారు.
జాతీయస్థాయి నాయకులు అయిన రాహుల్ గాంధీ, మోడీలు తెలంగాణ విషయానికి వచ్చేసరికి మరుగుజ్జులుగా మారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ కుటుంబం మొత్తం పోరాటాలమయం అన్నారు. కెసిఆర్ను రాజకీయంగా దెబ్బతీయలేకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు.
హక్కు లేదు: కడియం
తెరాసను, కెసిఆర్ను విమర్శించే నైతిక హక్కు బిజెపి, కాంగ్రెసు పార్టీలకు లేదని కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో అన్నారు. గాంధీ పేరుతో కాంగ్రెసు, మతోన్మాదం పేరుతో బిజెపి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తెరాసకు ఆదరణ పెరుగుతున్నందునే తమను టార్గెట్ చేసుకున్నారన్నారు.
జనం ఓ లెక్కా: జగన్
సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు జనం ఓ లెక్కనా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్ బుధవారం గుంటూరు జిల్లా వినుకొండలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మీకు ఎలాంటి సిఎం కావాలి.. ఎలాంటి నేత కావాలో ఆలోచించుకొని ఓటు వేయాలని సూచించారు.
పేదల పక్షాన నిలబడే నేతకు ఓటేయాలన్నారు. పేదల గుండెల్లే నేటికీ వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారన్నారు. వైయస్ మరణం అనంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయిందన్నారు. సోనియా ఇష్టారీతిగా రాష్ట్రాన్ని విడదీస్తే చంద్రబాబు అందుకు సహకరించారన్నారు. ఇప్పుడు బాబు దొంగ హామీలతో ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు.