సిఎం రేసులో 12మంది, ఖిలాషాపుర్ వెళ్దామా: హరీష్
మెదక్: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీలో పన్నెండు మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని.. ఆ పార్టీకి అధికారం ఇస్తే కుక్కలు చింపిన విస్తరేనని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు ఆదివారం అన్నారు. అధికారం దక్కగానే తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోదామని ఆ పార్టీలో 12 మంది ఎదురుచూస్తున్నారని ధ్వజమెత్తారు.
జిల్లాకు ముగ్గురు చొప్పున చవఎం సీటు కోసం పోటీపడుతున్నారన్నారు. జగ్గారెడ్డికి ఓటేస్తే సమైక్యవాదానికి ఓటు వేసినట్లేనన్నారు. ఎవరు దొరల్లా వ్యవహరిస్తున్నారో ఎవరికి గడీలు ఉన్నాయో తేల్చుకుందామా అంటూ హరీశ్ రావు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కెసిఆర్ స్వగ్రామం చింతమడక, పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామం ఖిలాషాపూర్లకు వెళ్తే ఎవరికి గడీలున్నాయో, ఎవరు దొరలాగా వ్యవహరిస్తున్నారో తెలుస్తుందన్నారు.
కెసిఆర్ ఇల్లు బడిగా మారితే, పొన్నాల ఇల్లు గడీ అయిందన్నారు. తనకు భువనగిరి, కోడలు వైశాలికి జనగామ అడిగినప్పుడు కుటుంబ పాలన గుర్తుకు రాలేదా అన్నారు. కెసిఆర్ గడీలను వదిలి సామాన్య జీవితం గడుపుతుంటే, పొన్నాల, దామోదర రాజనర్సింహలు సామాన్యుల నుంచి గడీలకు పడగలెత్తారన్నారు. తెరాస మేనిఫెస్టోను కాంగ్రెస్ వారు మక్కీకి మక్కీ దించారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
2009లో విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక్క దాన్ని నెరవేర్చలేదని, ఈ విషయంలో పొన్నాలతో చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. సీమాంధ్రకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులతో బంగారు తెలంగాణ అసాధ్యమన్నారు. కాంగ్రెసు నాయకులకు అమరవీరుల కుటుంబాల పట్ల ప్రేమ ఉంటే వారికి టికెట్లు ఎందుకు కేటాయించలేదన్నారు. శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మపై పోటీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.